శిరోముండనం బాధితుడు ప్రసాద్‌ అదృశ్యం 

ఏపీలో సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం బాధితుడు ప్రసాద్‌ అదృశ్యమయ్యాడు....

Updated : 05 Feb 2021 22:35 IST

పోలీసులను ఆశ్రయించిన భార్య కౌసల్య  

సీతానగరం : తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ఇండుగమల్లి ప్రసాద్‌ కనిపించడం లేదంటూ ఆయన భార్య కౌసల్య గురువారం పోలీసులను ఆశ్రయించారు. గతేడాది జులై 18న మునికూడలి, కటావరం వద్ద ఇసుక రేవు వివాదంలో ప్రసాద్‌కు పోలీసు స్టేషన్‌లోనే అప్పటి ఎస్సై ఫిరోజ్‌ శిరోముండనం చేయించారు. ఈ ఉదంతం రాష్ట్రపతి కార్యాలయం వరకు చేరడంతో అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. తనకు శిరోముండనం చేయించిన, ప్రోత్సహించిన వైకాపా నాయకులను అరెస్టు చేయాలంటూ బాధితుడు గతంలో నిరసన దీక్షకు కూడా దిగారు. అప్పటి నుంచి ఈ కేసు విషయంలో పురోగతి లేదు. దీంతో తీవ్ర మనస్తాపంతో ఉన్న బాధితుడు ప్రసాద్‌ తనకు ఇక న్యాయం జరగదని, శిరోముండనంపై సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని తరచూ వాపోయేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక తనను చూడలేరంటూ ప్రసాద్‌ బుధవారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లాడని భార్య కౌసల్య చెప్పారు. ఈ మేరకు సీతానగరం ఠాణాలో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కోరుకొండ సీఐ పవన్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని