AP News: అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని మృతి

ఇంజినీరింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన విజయవాడలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం తెడ్లం గ్రామానికి చెందిన కంకిపాటి మున్ని (21) విజయవాడలో బీటెక్‌ చదవుతోంది.

Updated : 27 Jul 2021 12:51 IST
ప్రియుడే చంపాడని బంధువుల ఆరోపణ
కంకిపాటి మున్ని (పాతచిత్రం)

గుణదల, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన విజయవాడలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం తెడ్లం గ్రామానికి చెందిన కంకిపాటి మున్ని (21) విజయవాడలో బీటెక్‌ చదవుతోంది. కరోనా నేపథ్యంలో ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్‌లోనే తరగతులకు హాజరవుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొవ్వాడ తరుణ్‌ తెడ్లంలో ఉంటున్న తన సోదరి ఇంటికి గత ఏడాది వచ్చాడు. అక్క కుటుంబానికి చెందిన ఈ- సేవ కేంద్రంలో పని చేసేవాడు. ప్రాజెక్టు పని మీద మున్ని తరచూ అక్కడకు వచ్చేది. ఈ క్రమంలో వాళ్లిద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. ఈ నెలలో పరీక్షలు ఉన్నాయని మున్ని విజయవాడకు వచ్చింది. ఖాళీగా ఉండడం ఎందుకని, ఓ ప్రైవేటు సంస్థలో టెలికాలర్‌గా విధుల్లోకి చేరింది. అదే సంస్థలో తన స్నేహితుడు తరుణ్‌ కూడా చేరాడు. దీంతో ఇద్దరూ ఒకే చోట ఉండాలని నిశ్చయించుకున్నారు. అన్నా, చెల్లెళ్లమని గుణదల ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఈ నెల 6న చేరారు.

మిస్డ్‌కాల్‌ వివాదం

ఈ నెల 23న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మున్ని ఫోన్‌కు ఆమె పాత స్నేహితుడు మిస్డ్‌కాల్‌ ఇచ్చాడు. ఆమె చరవాణిని తరుణ్‌ పరిశీలించి, అతనితో ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నించాడు. ఆ నెంబర్‌ బ్లాక్‌ లిస్ట్‌లో ఉందని, తాను మాట్లాడడం లేదని తెలిపింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో నిన్ను పెళ్లిచేసుకోను అంటూ తరుణ్‌ బయటకు వచ్చేశాడు. దీంతో ఆమె గదిలోపలికి వెళ్లి తలుపులు బిగించుకుంది. ఆ సమయంలో ఇంటి యజమాని వచ్చి, లోపల తమ పలుగు ఉందని, ఓ సారి ఇవ్వాలని బయట కూర్చున్న తరుణ్‌ని అడిగాడు. అతను తలుపు కొట్టగా, మున్ని ఎంత సేపటికీ తీయలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఉరివేసుకుని ఫ్యాన్‌కు వేలాడుతోంది. వెంటనే తలుపులు పగలగొట్టి ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి తరుణ్‌ మాచవరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘటనను పోలీసులకు వివరించాడు. మూడురోజులుగా మృత్యువుతో పోరాడిన మున్ని సోమవారం మధ్యాహ్నం మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నివేదిక ఆధారంగా తరుణ్‌పై కేసు నమోదు చేయనున్నట్లు సీఐ ప్రభాకర్‌ తెలిపారు.

మాయమాటలతో వంచించాడు

కంప్యూటర్‌ కొనిస్తానని, మాయమాటలు చెప్పి ఇక్కడకు తమ అమ్మాయిని తరుణ్‌ తీసుకొచ్చాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. మరో రెండు రోజుల్లో పరీక్షలు పూర్తి చేసుకుని ఇంటికి వస్తానని శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు తల్లికి ఫోన్‌లో చెప్పిందన్నారు. వారు ప్రేమించుకుంటున్న సంగతి తెలియదని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తరుణ్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసి, మీ చెల్లి ఉరివేసుకుని చనిపోయిందని చెప్పాడని మున్ని అన్నయ్య సునీల్‌ తెలిపారు. వెంటనే కొత్త ఆసుపత్రికి వచ్చి సిబ్బందిని అడిగితే చనిపోలేదని, కొన ఊపిరితో ఉందని చెప్పారన్నారు. మున్ని మెడ ఎముకలు విరిగిపోయాయని, కాలి మడమ పైభాగంలో బొబ్బలున్నాయని, తరుణ్‌ ఆమెను కొట్టి చంపాడని బంధువులు ఆరోపించారు. నిందితుడిపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయాలన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు