Suicides in Kota: కోటలో వరుస ఆత్మహత్యలు.. 2 రోజుల్లో ఇద్దరు విద్యార్థుల మృతి

కోట (Kota) పట్టణంలో గత కొన్ని నెలలుగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒత్తిడి తట్టుకోలేక వారు చనిపోతున్నట్లు తెలుస్తోంది.

Published : 28 Jun 2023 12:06 IST

జైపుర్‌: రాజస్థాన్‌లోని కోట పట్టణంలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతోంది. తాజాగా 2 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

ఉదయ్‌పుర్‌ జిల్లా సాలుంబర్‌ గ్రామానికి చెందిన మెహుల్‌ వైష్ణవ్‌ (18) నీట్‌కు ప్రిపేర్‌ అవ్వడం కోసం రెండు నెలల క్రితం కోటకు వచ్చాడు. విజ్ఞాన్‌ నగర్‌లో ఓ హాస్టల్‌లో నివాసముంటూ చదువుకుంటున్నాడు. సోమవారం రాత్రి మెహుల్‌ తన గదిలో ఒంటరిగా ఉన్నాడు. మంగళవారం ఉదయం ఎంతసేపైనా ఆ విద్యార్థి తన గది నుంచి బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థులు కేర్‌టేకర్‌కు సమాచారం అందించారు. ఆయన తలుపు బద్దలు కొట్టి చూడగా మెహుల్‌ గదిలోని ఫ్యాన్‌కి ఉరి వేసుకుని కనిపించాడు. ఒత్తిడి కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక ఈ ఘటన జరిగిన 24 గంటల్లోనే ఆదిత్య అనే మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇతడు రెండు నెలల కిందటే నీట్‌ కోచింగ్‌ నిమిత్తం కోటకు వచ్చాడు. విజ్ఞాన్‌ నగర్‌లోనే మరో హాస్టల్‌లో ఉంటూ కోచింగ్‌ తీసుకున్నాడు. అయితే మంగళవారం ఆదిత్య తన గదిలో ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. బిహార్‌కు చెందిన మరో 17 ఏళ్ల విద్యార్థి కూడా మంగళవారం ఆత్మహత్యకు యత్నించగా.. చివరినిమిషంలో అతడ్ని కాపాడగలిగారు. ఈ విద్యార్థి తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చనిపోవాలనుకున్నట్లు చెప్పాడు. దీంతో వారు వెంటనే కోటలోని చైల్డ్‌లైన్‌కు ఫోన్‌ చేసి సమాచారమిచ్చారు. వారు అప్రమత్తమై హాస్టల్‌కు చేరుకుని ఆ విద్యార్థిని కాపాడారు.

వివిధ ఎంట్రెన్స్‌ టెస్టులు, పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్లకు కోట ప్రసిద్ధి చెందింది. కేవలం రాజస్థాన్‌ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి కోచింగ్‌ తీసుకుంటారు. అయితే గత కొన్ని రోజులుగా విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో కోట పట్టణం తరచూ వార్తల్లో నిలుస్తోంది. గతేడాది 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఏడాది ఇప్పటికే ఈ సంఖ్య 14కు చేరడం విచారకరం. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు మరణాల వెనుక కారణాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చదువుపై ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా లేదా అనే దానిపై ఇనిస్టిట్యూట్ అధికారుల నుంచి వారికి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని