logo

వారి వ్యూహం... వీరి సహకారం!

‘సోమవారం ఉదయం 10 గంటలకు అనంతపురం టవర్‌క్లాక్‌ దగ్గరికి వస్తా.. అక్కడి నుంచి రాప్తాడు సర్కిల్‌ వస్తా.. రామగిరి మండలం వస్తా.. లేదంటే మా గుంటూరోడు మొద్దుశీను.. పరిటాల రవిని చంపిన పార్టీ కార్యాలయం వద్దకు వస్తా.

Published : 07 Mar 2023 05:06 IST

రెచ్చిపోయిన వైకాపా నాయకుడు
కట్టడి చేయని పోలీసులు
అనంతలో హరికృష్ణారెడ్డి వ్యవహారంపై కలకలం
ఈనాడు డిజిటల్‌, అనంతపురం -న్యూస్‌టుడే, అనంత నేరవార్తలు

అనంతపురంలో తెదేపా శ్రేణులను నిలువరిస్తున్న పోలీసులు

‘సోమవారం ఉదయం 10 గంటలకు అనంతపురం టవర్‌క్లాక్‌ దగ్గరికి వస్తా.. అక్కడి నుంచి రాప్తాడు సర్కిల్‌ వస్తా.. రామగిరి మండలం వస్తా.. లేదంటే మా గుంటూరోడు మొద్దుశీను.. పరిటాల రవిని చంపిన పార్టీ కార్యాలయం వద్దకు వస్తా. ఎవడైనా ఉంటే అక్కడికి రండి చూసుకుందాం’ అంటూ గుంటూరు జిల్లాకు చెందిన వైకాపా నాయకుడు హరికృష్ణారెడ్డి సవాల్‌ విసురుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశాడు. ఈక్రమంలో అతడిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయలేదని తెలుస్తోంది. దీంతో రాప్తాడు, రామగిరి మండలాల్లో తిరిగి.. టవర్‌క్లాక్‌ వద్దకు వచ్చి మీసం మెలేసే వరకు పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం గమనార్హం. తెదేపా శ్రేణుల్ని ముందుస్తుగా కట్టడి చేసిన పోలీసులు.. హరికృష్ణారెడ్డి, వైకాపా శ్రేణుల్ని స్వేచ్ఛగా వదిలేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాల్సిన పోలీసులే ప్రేక్షకపాత్ర వహించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.

 రెచ్చగొడుతూ...

ఓ ప్రజాప్రతినిధి అండతో హరికృష్ణారెడ్డి సోమవారం అనంతపురం చేరుకున్నాడు. ముందుగా రాప్తాడులోని తెదేపా కార్యాలయం వద్దకు వెళ్లి పరిటాల కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో చిత్రీకరించాడు. ఈ సమయంలో ఆయన వెంట రాప్తాడు వైకాపా నాయకులు ఉన్నట్లు వీడియోలో స్పష్టమవుతోంది. రాప్తాడు పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉంది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అక్కడి నుంచి జాకీ పరిశ్రమకు కేటాయించిన భూముల వద్దకు వెళ్లి హల్‌చల్‌ చేశాడు. తర్వాత రామగిరి మండలానికి వెళ్లి ఫొటోలు దిగి వాట్సాప్‌లో పోస్టు చేశాడు. రాప్తాడు మండలానికి చెందిన వైకాపా నాయకుల కార్లలో ప్రధాన రహదారుల్లోనే హరికృష్ణారెడ్డి ప్రయాణం చేశాడు. టవర్‌క్లాక్‌ వద్దకు వచ్చి రెచ్చగొట్టేలా మాట్లాడిన తర్వాత గానీ పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. అంతకుముందే టవర్‌క్లాక్‌ వద్దకు వచ్చిన తెదేపా నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. వైకాపా నాయకుడిని జీపులో ఎక్కించుకుని జాగ్రత్తగా జిల్లా సరిహద్దు దాటించారు. అంతకుముందు డీఎస్పీ ప్రసాదరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హరికృష్ణారెడ్డిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. తరువాత అరగంటకే అతడు వైకాపా శ్రేణులతో కలిసి టవర్‌క్లాక్‌ వద్దకు చేరుకోవడం గమనార్హం. 

ముందస్తుగా ఫిర్యాదు చేసినా..

సామాజిక మాధ్యమాల వేదికగా అనంతపురం వస్తానని సవాల్‌ చేయడంపై మాజీ మంత్రి పరిటాల సునీత ఆదివారం రాత్రి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఓ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో పోలీసులు అడ్డుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హరికృష్ణారెడ్డితో పాటు అతని వెంట ఉన్న పది మంది వివరాలు తెదేపా నాయకులు ముందుగానే పోలీసులకు అందించారు. సాంకేతిక పరిజ్ఞానంతో వారిని కనుగొనే ప్రయత్నం చేయలేదు. రాప్తాడులో తెదేపా నాయకుల్ని అరెస్టు చేసి.. వైకాపా నాయకుడు టవర్‌క్లాక్‌ వద్దకు చేరుకునేందుకు మార్గం సుగుమం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని