logo

పనులు సరే... పైసల సంగతేంటి!

బొమ్మూరు న్యాక్‌ భవనంలో గతేడాది ఏప్రిల్‌లో తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌ ఏర్పాటు చేశారు. దశలవారీగా అధికారుల ఛాంబర్లు, సమావేశ మందిరాలు ఆధునిక హంగులతో తీర్చిదిద్దడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు కొంతమేర సమకూర్చారు.

Published : 27 Mar 2023 05:32 IST

న్యూస్‌టుడే, జిల్లా సచివాలయం

కలెక్టరేట్‌లో ఏడు నెలల కిందట ఏర్పాటు చేసిన ఆర్వోప్లాంట్‌

బొమ్మూరు న్యాక్‌ భవనంలో గతేడాది ఏప్రిల్‌లో తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌ ఏర్పాటు చేశారు. దశలవారీగా అధికారుల ఛాంబర్లు, సమావేశ మందిరాలు ఆధునిక హంగులతో తీర్చిదిద్దడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు కొంతమేర సమకూర్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు మాత్రం పూర్తిస్థాయిలో చెల్లించలేదు. నెలలు గడుస్తున్నా చేసిన పనులకు సంబంధించి రూ.కోటికి పైగా బిల్లులు బకాయి ఉండటంతో గుత్తేదారులు గగ్గోలు పెడుతున్నారు.  

కలెక్టరేట్‌లో మౌలిక సదుపాయాలు, ఆధునిక వసతుల కల్పనకు ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏడెనిమిది నెలల కిందట గుత్తేదారులకు వివిధ పనులు అప్పగించారు. న్యాక్‌ భవనం పైఅంతస్తులో కలెక్టర్‌, జేసీ, డీఆర్వో ఛాంబర్‌లతోపాటు వీసీ సమావేశ మందిరం, పరిపాలన, ఎస్టాబ్లిష్‌మెంట్‌, కోఆర్డినేషన్‌, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌, మెజిస్ట్రీరియల్‌ విభాగాలు, రికార్డు రూమ్‌ తదితర సెక్షన్లు కొనసాగుతున్నాయి. ఇదే అంతస్తులో జిల్లా అర్ధగణాంకాధికారి (సీపీవో), వ్యవసాయ, హౌసింగ్‌, సివిల్‌ సప్లయి, సర్వే భూ రికార్డులు, వికాస, పౌరసరఫరాల సంస్థ డీఎం కార్యాలయం కొనసాగుతుండగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మరో రెండు హాళ్లను కలెక్టరేట్‌కు వినియోగిస్తున్నారు. దీనిలో ఒకదానిని స్పందన, మరో దానిని స్పందన అర్జీల ఆన్‌లైన్‌ ప్రక్రియ నిర్వహణకు కేటాయించారు. కలెక్టరేట్‌లోని ఆయా విభాగాలు, వివిధ శాఖల కార్యాలయాలు, సమావేశ మందిరాల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించారు. దీనికోసం ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ తదితర శాఖల పర్యవేక్షణలో గుత్తేదారులకు పనులు అప్పగించి చేయించారు. ఆయా విభాగాల్లో, శాఖల కార్యాలయాల్లో ఫర్నిచర్‌, ర్యాక్‌ల ఏర్పాటు, ఛాంబర్లు, సమావేశ మందిరాల ఆధునికీకరణ తదితర పనులకు సంబంధించి రూ.86 లక్షల వరకు బిల్లులు నెలలుగా పెండింగ్‌ ఉండిపోయినట్లు గుత్తేదారులు చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం కూడా ముగియనుందని, ఇప్పట్లో తమకు రావాల్సిన బిల్లులు ఇస్తారో లేదో కూడా తెలియడంలేదని ఆందోళన చెందుతున్నారు.

వర్షం నీరు నిలిచిపోకుండా నిర్మించిన డ్రెయిన్‌


వీటిదీ అదే తీరు...

జిల్లా కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు, సిబ్బందికి శుద్ధి తాగునీటిని అందించేందుకు కలెక్టరేట్‌ భవనం పైఅంతస్తులో రెండు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఆర్వోప్లాంట్‌, పైపులైను, కూలర్లు, ట్యాప్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ ఆవరణలో ఉన్న బోరు నుంచి నీటిని ఆర్వో ప్లాంట్‌కు పంపించి అక్కడి నుంచి శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ పర్యవేక్షణలో పనులు చేపట్టి ఏడునెలల కిందటే పూర్తి చేశారు.

* భవనం పైఅంతస్తులో రూ.3.60 లక్షలతో ఆర్వో ప్లాంట్‌, మరో రూ.3.90 లక్షలలో పైపులైన్లు పనులు, గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని స్పందన హాలు వద్ద కూలరు, ట్యాప్‌లు, పైఅంతస్తులో మరో కూలరు, ట్యాప్‌ల ఏర్పాటు చేసినప్పటికీ దీనికి సంబంధించిన బిల్లులు కూడా నేటికీ అధికారులు చెల్లించలేదని గుత్తేదారులు చెబుతున్నారు.

* వర్షం వచ్చినప్పుడు కలెక్టరేట్‌ భవనం ఎదుట నీరు నిలిచిపోకుండా భవనం చుట్టూ పెద్ద సీసీ డ్రెయిన్‌ నిర్మించడంతోపాటు భవనం లోపల నిలిచిపోయే నీరు బయటకు వచ్చే ఏర్పాట్లు చేశారు. ఆవరణలో గ్రీనరీ అభివృద్ధి చేసేందుకు చుట్టూ దిబ్బలు నిర్మించారు. వీటికి సంబంధించి రూ.20 లక్షల వరకు బిల్లు రావాల్సి  ఉందని గుత్తేదారులు చెబుతున్నారు.


త్వరలో క్లియర్‌ అయిపోతాయి..

బిల్లుల విషయాన్ని డీఆర్వో నరసింహులు వద్ద ప్రస్తావించగా... కలెక్టరేట్‌లో చేసిన పనులకు సంబంధించి ఇప్పటికే చాలావరకు బిల్లులు చెల్లింపులు జరిగాయని, కొద్ది మొత్తంలో పెండింగ్‌ ఉన్నవి కూడా త్వరలోనే క్లియర్‌ అయిపోతాయని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని