Revanth Reddy: కుటుంబ తగాదాల పరిష్కారం కోసమే బీఆర్‌ఎస్‌ను తీసుకొచ్చారు: రేవంత్‌

భారత్‌ రాష్ట్ర సమితి పేరున జాతీయ పార్టీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని చంపేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్‌ వ్యవహారశైలి ఉందని ధ్వజమెత్తారు.

Updated : 24 Mar 2023 15:31 IST

హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్ర సమితి పేరున జాతీయ పార్టీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని చంపేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్‌ వ్యవహారశైలి ఉందని ధ్వజమెత్తారు. తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని తెలంగాణ, ఏపీ విభజన సమస్యలను తామే పరిష్కరించుకుంటామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరుతో కేసీఆర్‌ ఆర్థికంగా బలోపేతం అయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని కేసీఆర్‌ గ్రహించారని, ఇకపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌తో రుణం తీరిపోయిందని పేర్కొన్నారు. అందువల్లనే తెలంగాణ అనే పదం కనిపించకుండా కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆర్‌ఎస్‌ను తీసుకొచ్చారని విమర్శించారు. తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమని, ఆ పదాన్ని చంపేయాలనుకుంటున్న వ్యక్తి కేసీఆర్‌ అని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ హంతకుడిని వదిలే ప్రస్తక్తే లేదని, ఒక తెలంగాణ బిడ్డగా తాను కేసీఆర్‌ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆయనలోని వికృత ఆలోచనలకు ఇది పరాకాష్ట అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇకపై పోటీ చేయడానికి కూడా కేసీఆర్‌కు అర్హత లేదని.. రాష్ట్ర ప్రజలు ఈ విషయం ఆలోచించాలన్నారు. కొన్ని రోజుల తరువాత ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదని రేవంత్‌ ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని