logo

బెడిసికొట్టిన వ్యాపారి కుమారుడి కిడ్నాప్‌ ప్రణాళిక

అయిదుగురు కలిసి ఓ వ్యాపారి కుమారుడిని అపహరించేందుకు యత్నించి విఫలమయ్యారు. వీరిలో ముగ్గురు పట్టుబడగా ఇద్దరు పరారీలో ఉన్నారు. కేపీహెచ్‌బీ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 01 Feb 2023 02:32 IST

అయిదుగురిలో ఇద్దరు పథకం మార్చడంతో బహిర్గతం

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: అయిదుగురు కలిసి ఓ వ్యాపారి కుమారుడిని అపహరించేందుకు యత్నించి విఫలమయ్యారు. వీరిలో ముగ్గురు పట్టుబడగా ఇద్దరు పరారీలో ఉన్నారు. కేపీహెచ్‌బీ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్‌నగర్‌లో ఓ ఇంజినీరింగ్‌ వర్క్స్‌ కంపెనీని నాగేశ్వరరావు నడిస్తున్నారు. ఇతని వద్ద ఏపీ పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన చెంచినాడ నర్సింహస్వామి (29) పనిచేస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు చెందిన సింగలూరి సురేశ్‌(26), అదే జిల్లాకు చెందిన నాగరాజు దొంగనోట్ల కేసులో జైలుకి వెళ్లొచ్చారు. వీరిద్దరూ నర్సింహస్వామి స్నేహితులు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు వెతికారు. తమ కంపెనీ యజమాని నాగేశ్వరరావు కుమారుడు భానుప్రకాశ్‌(20)ను కిడ్నాప్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేద్దామని నర్సింహస్వామి చెప్పడంతో సురేశ్‌, నాగరాజు ఒప్పుకొన్నారు. డబ్బు ఇవ్వకపోతే భానుప్రకాశ్‌ను చంపేయాలనుకున్నారు. నర్సింహస్వామి తనతోపాటే పనిచేస్తున్న బీదర్‌కు చెందిన ప్రశాంత్‌(31), పనిచేసి మానేసిన బాబును ఈ పథకంలో సాయం కోరాడు.

బయటపడిందిలా.. గత ఏడాది అక్టోబరులో అయిదుగురూ కలిసి భానుప్రకాశ్‌ను కిడ్నాప్‌ చేసేందుకు కంపెనీ వద్దకు వెళ్లగా జనం కదలికలు, సీసీ కెమెరాలు ఉండటంతో ప్రణాళికను వాయిదా వేశారు. తర్వాత పెనుగొండకు తిరిగి వెళ్లిపోయిన సురేశ్‌, నాగరాజు.. డిసెంబరు 26న హైదరాబాద్‌ వచ్చి నేరుగా కంపెనీకి వెళ్లి యజమాని నాగేశ్వరరావును కలిశారు. ‘మీ కుమారుడిని కిడ్నాప్‌ చేసేందుకు మీ కంపెనీలో పనిచేసేవారే ప్రణాళిక వేశారని, వారి పేర్లు చెప్పాలంటే డబ్బులివ్వాల’ంటూ బేరసారాలకు దిగారు. దీనికి ఒప్పుకొన్న నాగేశ్వరరావు ఆ ఇద్దరి వివరాలు తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం ప్రణాళిక బయటపడింది. నర్సింహస్వామి, ప్రశాంత్‌, సరేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాబు, నాగరాజు పరారీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని