logo

ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా.. నిరంతర నిగా

స్వేచ్ఛాయుత, సమర్థవంత ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం సాంకేతిక విధానాన్ని అమలు చేస్తోంది. ఎలాంటి ఘర్షణలు, అల్లర్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది.

Published : 06 May 2024 06:32 IST

పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ సేవలు

పెద్దపల్లి జిల్లాలో పోలింగ్‌ కేంద్రం భవనానికి బిగిస్తున్న సీసీ కెమెరా (పాతచిత్రం)

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: స్వేచ్ఛాయుత, సమర్థవంత ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం సాంకేతిక విధానాన్ని అమలు చేస్తోంది. ఎలాంటి ఘర్షణలు, అల్లర్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల సరళిని నిరంతరం పర్యవేక్షించేందుకు వెబ్‌కాస్టింగ్‌ చేయాలని నిర్ణయించింది. ఇంటర్నెట్‌ అనుకూలంగా లేని మారుమూల ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా సీసీ కెమెరాల్లో వీక్షించనున్నారు. గతంలో ఇంజినీరింగ్‌ విద్యార్థుల సేవలను వినియోగించుకోగా ఇటీవల జరిగిన శాసనభ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో ఒకే ప్రైవేటు ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.

దొంగ ఓట్లను నివారించడానికే..

ఎన్నికల్లో ప్రత్యర్థులు పరస్పర ఘర్షణలకు పాల్పడుతున్నారు. నగదు, మద్యం, ఇతర కానుకలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఒకరికి బదులు మరొకరు వచ్చి దొంగ ఓటు వేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. అల్లర్లు, హింసాత్మక సంఘటనలను తావులేకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం 2018లో తొలిసారిగా వెబ్‌కాస్టింగ్‌ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఓటింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు నిరంతరం ఆన్‌లైన్‌లో నిక్షిప్తమవుతోంది. వీటిని జిల్లా కేంద్రంలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి అనుసంధానిస్తారు. ఎక్కడైనా అల్లర్లు, ఘర్షణలు జరిగితే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దనున్నారు.  


జిల్లా స్థాయిలో పర్యవేక్షణ

  • సమస్యాత్మక ప్రాంతాలు, వెయ్యి ఓటర్ల కంటే ఎక్కువ ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేస్తారు.
  • ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న యువత వివరాలు సేకరిస్తున్నారు.
  • ఎంపికైన యువతకు వెబ్‌కాస్టింగ్‌ ఎలా చేయాలనే అంశంపై శిక్షణ ఇవ్వనున్నారు.
  • జిల్లా స్థాయిలో అధికారులు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ సరళిని పర్యవేక్షిస్తున్నారు.
  • ఏదైనా సంఘటనలు జరిగితే వీడియో చిత్రాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటారు.

అంతర్జాల సేవలే అసలు సమస్య

పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌పై ఇంటర్నెట్‌ సేవలు ప్రభావం చూపుతున్నాయి. పల్లెల్లో 4జీ, 5జీ సేవలు అందుబాటులో రాలేవు. సిగ్నల్‌ సక్రమంగా లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడంలేదు. కొన్ని చోట్ల ప్రత్యామ్నాయంగా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఒకటి రెండ్రోజుల్లో జాబితా కొలిక్కిరానుంది. ఉమ్మడి జిల్లాలో 2019 ఎన్నికల్లో 4,669 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా వీటిలో 2,742 వెబ్‌కాస్టింగ్‌, 2,219 చోట్ల సీసీ కెమెరాలను బిగించారు. ప్రస్తుతం వీటి సంఖ్య పెరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని