logo

అలిగిన ఆశావహులు

ప్రతిష్ఠాత్మకమైన విజయనగర నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడు పార్టీలు తమ అభ్యర్థులను వెల్లడించాయి. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే గవియప్ప....

Published : 31 Mar 2023 03:21 IST

విజయనగర కాంగ్రెస్‌ అభ్యర్థికి ఎన్నికలు సవాలే

నియోజకవర్గంలో ఒంటరిగా ప్రచారం చేస్తున్న విజయనగర కాంగ్రెస్‌ అభ్యర్థి హెచ్‌.ఆర్‌.గవియప్ప

హొసపేటె, న్యూస్‌టుడే:  ప్రతిష్ఠాత్మకమైన విజయనగర నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడు పార్టీలు తమ అభ్యర్థులను వెల్లడించాయి. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే గవియప్ప, ఆమ్‌ ఆద్మీ నుంచి డి.శంకర్‌ దాస్‌, కర్ణాటక రాష్ట్ర సమితి నుంచి కణదాళు మంజునాథ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. ఇప్పటివరకు భాజపా, జేడీఎస్‌, సీపీఎం అభ్యర్థులను ప్రకటించలేదు. 2008లో నియోజకవర్గం పునర్విభజన తరువాత, జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికలు, ఓ ఉప ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, భాజపా నడుమ ప్రత్యక్ష పోరు జరిగింది. ఈ సారి కూడా రెండు ప్రముఖ పార్టీల అభ్యర్థుల నడుమ పోరు గట్టిగా ఉంటుంది. విజయనగర నియోజకవర్గం కాంగ్రెస్‌ టికెట్టు కోసం సుమారు 12మంది దరఖాస్తు వేశారు. అందులో మాజీ ఎమ్మెల్యే గవియప్పకు పార్టీ టికెట్‌ కట్టబెట్టింది. మిగిలినవారు మరుసటి రోజునుంచే అలిగి ఇళ్లకు పరిమితమయ్యారు. సండూరు రాజవంశీకుడు వెంకట్రావు ఘోర్పడే, కొప్పళ నాయకుడు రాజశేఖర్‌ హిట్నాళు, సండూరు మాజీ ఎమ్మెల్యే సిరాజ్‌ షేక్‌, హొసపేటె మైనార్టీ నాయకుడు మహ్మద్‌ ఇమాం నియాజిలు టికెట్‌  ఆశావహుల్లో ప్రముఖులు. టికెట్టు వెల్లడించిన రోజు గవియప్ప మాధ్యమాలతో మాట్లాడుతూ..టికెట్‌ దొరక్క నిరాశచెందినవారిని కూడా కలుపుకొని ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వారెవరిని అభ్యర్థి గవియప్ప పలకరించలేదని తెలిసింది. తన ఇద్దరు కుమారులు చెరో వైపు, తను ఓ వైపు ఒంటరిగానే అభ్యర్థి గవియప్ప ప్రచారాన్ని ప్రారంభించారు. 2004లో హొసపేటె నియోజకవర్గంలో స్వతంత్రుడిగా గెలిచిన గవియప్ప, తరువాత కాంగ్రెస్‌లో చేరి 2008లో విజయనగర నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. అప్పుడు భాజపా నుంచి ఆనంద్‌సింగ్‌, స్వతంత్రుడిగా దీపక్‌సింగ్‌ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థి దీపక్‌సింగ్‌ ఓట్లను చీల్చడంతో భాజపా అభ్యర్థి ఆనంద్‌సింగ్‌ విజయం సాధించారు. 2013లో గవియప్ప మరోసారి కాంగ్రెస్‌ టికెట్‌కోసం ప్రయత్నించినా, అది మైనార్టీ నాయకుడు అబ్దుల్‌ వహాబ్‌కు దక్కింది. ఆయన కూడా భాజపా అభ్యర్థి ఆనంద్‌సింగ్‌ చేతిలో ఓడిపోయారు. 2018లో అనుకోకుండా ఆనంద్‌సింగ్‌ కాంగ్రెస్‌లో చేరి టికెట్టుతో విజయనగర బరిలో దిగారు. గవియప్ప కూడా అనుకోకుండా భాజపాలో చేరి ఆనంద్‌సింగ్‌ను ఎదుర్కొని మరోసారి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు గవియప్పకు మరోసారి కాంగ్రెస్‌ టికెట్‌ దక్కింది. ఆయన దారి అంత సులభంగా లేదు. నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడంతో కాంగ్రెస్‌లో చీలికలు ఏర్పడ్డాయి. వారందరినీ సమన్వయం చేసుకుని పోయే పెద్ద బాధ్యత అభ్యర్థి గవియప్పపైన ఉంది. ఇప్పటివరకు ఆయన తమను సంప్రదించనేలేదని టికెట్‌కోసం ప్రయత్నించిన రాజవంశీకుడు వెంకట్రావు ఘోర్పడే, మైనార్టీ నాయకుడు మహ్మద్‌ ఇమాం నియాజిలు స్పష్టం చేశారు. ఆయన ఆసక్తి చూపి ఆహ్వానిస్తే తప్పకుండా ఆయన తరఫున ప్రచారంలో పాల్గొంటామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని