logo

తెరాస పాలనలో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి: సంకినేని

తెరాస పాలనలో అన్యాయాలు, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

Published : 29 May 2022 06:03 IST

సూర్యాపేటలో మాట్లాడుతున్న సంకినేని వెంకటేశ్వర్‌రావు

సూర్యాపేట గ్రామీణం, న్యూస్‌టుడే: తెరాస పాలనలో అన్యాయాలు, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి మరిచిపోయారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత భాజపా పెట్రోల్‌పై ఎలాంటి వ్యాట్‌ పెంచలేదన్నారు. 2015లో పెట్రోల్‌ ధరలు తగ్గు ముఖం పట్టినపుడు ఆదాయం పెంచుకోవడానికి 2 రూపాయలు పెంచి వసూలు చేశారన్నారు. కొద్ది రోజులకే 31 శాతం ఉన్న పెట్రోల్‌ను 35.2 శాతానికి వ్యాట్‌ పెంచిన ఘనత కెసీఆర్‌దేనన్నారు. 22.5 శాతం డీజిల్‌పై ఉన్న వ్యాట్‌ను 27 శాతానికి పెంచిన ఘనుడని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్‌రెడ్డి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు. మంత్రి ప్రమేయంతోనే నార్కట్‌పల్లిలో చెరువు కబ్జా చేశారన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే తెరాసకు ఓటు వేసినట్లేనన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాల్లో తెలిసేలా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే రాములు, అధికార ప్రతినిధులు పాల్వాయి రజనీకుమారి, కిశోర్‌, జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని