logo

కల్యాణికి.. కన్నీరే మిగిలె..!

ఆదివారం సెలవు కావడంతో పిల్లలను తీసుకొని ద్విచక్ర వాహనంపై పక్క ఊరిలోని అన్న ఇంటికి వెళ్తుండగా.. లారీ ఢీకొని తండ్రీ కొడుకులు దుర్మరణం చెందారు.

Published : 05 Dec 2022 06:17 IST

రోడ్డు ప్రమాదంలో భర్త, కుమారుడు దుర్మరణం, కుమార్తెకు గాయాలు

నేరేడుచర్ల, న్యూస్‌టుడే: ఆదివారం సెలవు కావడంతో పిల్లలను తీసుకొని ద్విచక్ర వాహనంపై పక్క ఊరిలోని అన్న ఇంటికి వెళ్తుండగా.. లారీ ఢీకొని తండ్రీ కొడుకులు దుర్మరణం చెందారు. కూతురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది ఈ ఘటన కోదాడ- మిర్యాలగూడ రహదారి (ఎన్‌.హెచ్‌-167)పై సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలిక పరిధిలోని ఎన్టీఆర్‌నగర్‌ వద్ద జరిగింది. నేరేడుచర్ల ఎస్సై ఎం.నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రామాపురానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు సత్యనారాయణ (40) ఉదయం పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెంలోని టమాటా తోట వద్దకు వెళ్లి వచ్చాడు. ఆయన భార్య కల్యాణి భవన నిర్మాణ పనులకు హుజూర్‌నగర్‌ వెళ్లింది. ఇంటి వద్ద ఆడుకుంటున్న పిల్లలను తీసుకొని సత్యనారాయణ ద్విచక్ర వాహనంపై అన్న ఇంటికి బయలు దేరాడు. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలతో కలిసి చిల్లేపల్లి వైపు వెళ్తుండగా.. ఎన్టీఆర్‌నగర్‌ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. సత్యనారాయణ, కుమారుడు జస్వంత్‌ (12) అక్కడికక్కడే మృతి చెందారు. కుమార్తె కావేరి (14) తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు.  జస్వంత్‌ నేరేడుచర్ల ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. కుమార్తె కావేరి అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. లారీ డ్రైవర్‌ అతివేగం, అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాలను శవపరీక్షకు పంపి, భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని