logo

ఆ రోజు ఆగకుంటే... సాధారణ మృతిగానే మిగిలేది!

అంత్యక్రియలకు ఒక్క రోజు ఆగకపోయి ఉంటే.. ఓ హత్య, సాధారణ మృతిగా మిగిలిపోయేది. అయిదుగురు కలిసి పన్నిన కుట్ర ఎప్పటికీ బహిర్గతం కాకపోయేది.

Updated : 25 Mar 2023 12:33 IST

డాక్టర్‌ విజయకుమార్‌ హత్య కేసులో అయిదుగురికి జీవిత ఖైదు
న్యూస్‌టుడే, నెల్లూరు (నేర విభాగం)

అంత్యక్రియలకు ఒక్క రోజు ఆగకపోయి ఉంటే.. ఓ హత్య, సాధారణ మృతిగా మిగిలిపోయేది. అయిదుగురు కలిసి పన్నిన కుట్ర ఎప్పటికీ బహిర్గతం కాకపోయేది. ఎట్టకేలకు దాన్ని హత్యగా గుర్తించిన న్యాయస్థానం అయిదుగురికి జీవిత ఖైదు విధించింది. జన విజ్ఞాన వేదిక సభ్యులు, నెల్లూరు ఆసుపత్రి అధినేత డాక్టర్‌ విజయకుమార్‌ హత్య కేసులో న్యాయస్థానం దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం సంచలన తీర్పు వెలువరించింది. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా అయిదుగురికి జీవిత ఖైదు.. రూ.అయిదు వేల చొప్పున జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి సి.సత్యవాణి శుక్రవారం తీర్పు వెలువరించడం సంచలనంగా మారింది.

అసలేం జరిగిందంటే...

2015, మే 28వ తేదీ.. నెల్లూరులోని రాజరాజేశ్వరీ దేవస్థానం సమీప ప్రాంతం.. ఇంటి యజమాని డాక్టర్‌ విజయకుమార్‌కు గుండెనొప్పి వచ్చిందంటూ కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ఇంటికి తరలించి.. అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మలేషియాలో ఉంటున్న విజయకుమార్‌ కుమార్తె ఇక్కడకు వచ్చేందుకు ఒక రోజు పడుతుందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. అతి కష్టం మీద అంత్యక్రియలను మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నారు.

హత్యకు సుపారీ రూ.అయిదు లక్షలు

డాక్టర్‌ విజయకుమార్‌ హత్యకు ఎం.గంగరాజుతో రూ.అయిదు లక్షలు సుపారీ మాట్లాడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తొలుత రూ. 30వేలు అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు.. హత్య అనంతరం మిగతా నగదు ఇస్తామని ఒప్పందం జరిగింది. అడ్వాన్స్‌ ఇచ్చిన అనంతరం గంగరాజు నుంచి ఒత్తిడి పెరగడం.. ఆ క్రమంలోనే హత్య చేసినట్లు తేలింది. కోర్టు శిక్ష వేసిన అయిదుగురిలో భార్య వి.ఉషారాణి, కుమారుడు సుందరయ్య, కె.శ్రీధర్‌, ఎం.గంగరాజు, పి.రాజ ఉన్నారు.

డాక్టర్‌ విజయకుమార్‌ (పాతచిత్రం)


స్నేహితుడి ఫిర్యాదుతో...

విజయకుమార్‌ స్నేహితుడు.. శేషారెడ్డి తన మిత్రుడి మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ వేదాయపాళెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో ఈ కేసు అటు పోలీసుశాఖలో, ఇటు రాజకీయంగానూ సంచలనమైంది. నాటి ఎస్పీ గజరావు భూపాల్‌.. ఈ సంఘటనపై ప్రత్యేక దృష్టిసారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని ఒత్తిడి రాగా- అందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఆ క్రమంలో నాడు పెద్ద కథే నడిచింది. తమ భర్త మృతదేహాన్ని వదిలేయాలంటూ భార్య, మరోవైపు కుమారుడు కన్నీరుమున్నీరవుతూ పోలీసులను వేడుకున్నారు. అంత్యక్రియల కోసం వాహనం కూడా సిద్ధం చేశారు. ఇంతలో ఒక రోజు గడవగానే.. మృతదేహం రంగు మారింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఎలాగైనా అంత్యక్రియలు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఎస్పీ అంతిమ యాత్ర ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో నాటి ఎస్సై జగత్‌సింగ్‌.. వాహనం ముందుకు కదిలితే ఒప్పుకొనేది లేదంటూ.. వాహనం ఎదుట భీష్మించారు. నాడు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎట్టకేలకు పోలీసులు ఫోరెన్సిక్‌ వైద్యుడు శశికాంత్‌ ఆధ్వర్యంలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయించారు. డాక్టర్‌ విజయకుమార్‌ గుండెనొప్పితో చనిపోలేదని.. హత్యేనని వైద్యులు నిర్ధారించారు. నాటి నుంచి ఈ కేసు చర్చల్లోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని