logo

గల్లీ నుంచి దిల్లీకి మన్యం మహిళ..!

భద్రాచలం మన్యానికి చెందిన రాధాబాయి ఆనందరావు నాలుగు సార్లు వరసగా నెగ్గి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించి తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి భద్రాచలం ఎంపీగా 1967, 1971, 1977, 1980లో విజయబావుటా ఎగురవేసి మహిళా శక్తిని అప్పట్లోనే చాటిచెప్పారు.

Updated : 22 Apr 2024 09:27 IST

నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన రాధాబాయి ఆనందరావు

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం మన్యానికి చెందిన రాధాబాయి ఆనందరావు నాలుగు సార్లు వరసగా నెగ్గి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించి తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి భద్రాచలం ఎంపీగా 1967, 1971, 1977, 1980లో విజయబావుటా ఎగురవేసి మహిళా శక్తిని అప్పట్లోనే చాటిచెప్పారు. అప్పట్లో ప్రధాని ఇందిరగాంధీతో మాట్లాడాలంటే కాకలు తీరిన నాయకులు సైతం జంకేవారట. ఈమె మాత్రం నేరుగా ఇందిరను కలిసి ఈ ప్రాంత సమస్యలు ప్రస్తావించే చనువు పెంచుకుని ఆనాటి రాజకీయాల్లో ఓ సంచలనంగా నిలిచారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వంటి అగ్ర నాయకులతో రాజకీయ పరిచయాలు ఉండేవి. గిరిజనుల సంపూర్ణ వికాసం కోసం ఐటీడీఏల అవసరాన్ని గుర్తించి వీటి ఏర్పాటుకు జాతీయ స్థాయిలో ప్రయత్నం చేశారు. పశ్చిమ జర్మనీ, జకొస్లొవేకియా, బ్రిటన్‌ వంటి దేశాలలో పర్యటించారు. విదేశీ వ్యవహారాలలో అనుభవం గడించారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గానూ గుర్తింపు పొందారు. ఓయూ సెనేట్‌ సభ్యురాలిగా కొంత కాలం పని చేసిన రాధాబాయి ఆనందరావు ట్రైకార్‌ అధ్యక్షురాలిగా గిరిజన అభివృద్ధికి పాటుపడ్డారు.

  • సామాన్య గిరిజన కుటుంబంలో జన్మించిన ఆమె వ్యూహ ప్రతివ్యూహాల్లో దిట్టగా గల్లీ నుంచి దిల్లీ దాకా ఎదిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వెంకటాపురంలో 1930లో ఆమె జన్మించారు. వెంకటాపురం ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉంది. ఇది భద్రాచలం అసెంబ్లీ పరిధిలోని మండలం. రాజమండ్రిలో ఉపాధ్యాయ విద్యను అభ్యసించిన రాధాబాయి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఉపాధ్యాయురాలిగా సేవలు అందించారు. హిందీ పండిట్‌గా జాతీయ భాషపై విశేష ప్రచారం కల్పించారు. 1952లో కొత్తగూడేనికి చెందిన ఆనందరావును వివాహం చేసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో వైద్య వృత్తిపై ఆసక్తి పెంచుకుని నర్సింగ్‌ శిక్షణ పూర్తయ్యాక కుటుంబ నియంత్రణపై గిరిజన గ్రామాల్లో 1957 నుంచి 1966 వరకు ప్రచారం చేశారు. దేశ రాజకీయాల్లో ప్రత్యేకతను చాటిన భద్రాచలం ఎంపీ స్థానం 2009లో రద్దు కావడంతో ఇది మహబూబాబాద్‌ ఎంపీ స్థానంలో భాగమైంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని