Hyderabad: త్వరలో కామన్‌ మొబిలిటీ కార్డు.. పేర్లు సూచించండి: మంత్రి కేటీఆర్‌

నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి ఉపయుక్తంగా ఉండేలా ఒక కామన్‌ మొబిలిటీ కార్డును తీసుకొచ్చే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 

Updated : 20 Jul 2023 19:49 IST

హైదరాబాద్‌: నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి ఉపయుక్తంగా ఉండేలా ఒక కామన్‌ మొబిలిటీ కార్డును తీసుకొచ్చే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ మెట్రో రైల్‌, ఆర్టీసీ సంస్థలు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయి. హైదరాబాద్‌ నగరంలో ప్రధానమైన ప్రజారవాణా మార్గాలుగా ఉన్న మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేలా ఈ కార్డును తీసుకురానున్నారు.

కామన్ మొబిలిటీ కార్డుపై మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో సమావేశం జరిగింది. ఆర్టీసీ, మెట్రో రైలు సంస్థల ఉన్నతాధికారులు కార్డుకు సంబంధించిన వివరాలను అందించారు. మొదట మెట్రో రైల్‌, ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా కార్డుని జారీ చేస్తామని, ఇదే కార్డుతో భవిష్యత్తులో ఎంఎంటీఎస్‌, క్యాబ్‌ సేవలు, ఆటోలను కూడా వినియోగించుకునేలా విస్తరిస్తామని మంత్రులు తెలిపారు. పౌరులు తమ ఇతర కార్డుల తరహాలో రిటైల్‌ దుకాణాల్లో కొనుగోళ్లకు కూడా వినియోగించేలా ‘వన్‌ కార్డ్‌ ఫర్‌ ఆల్‌ నీడ్స్‌’ మాదిరి ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు.

ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌ నగరం వరకు ఈ కార్డు జారీ ఉంటుందని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కార్డు సేవలు అందేలా విస్తరించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోటా వినియోగించుకునే అవకాశం ఉండాలని మంత్రులు తెలిపారు. దీంతో ఇతర మెట్రో నగరాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆర్టీసీ బస్సులు, మెట్రో రైల్, ఇతర ప్రజారవాణా వ్యవస్థను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. ఈ కార్డును ప్రయోగాత్మకంగా ఆగస్టు రెండో వారంలోగా నగర పౌరులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం మెట్రో రైల్, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో వేగంగా ముందుకు పోవాలని మంత్రులు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేయనున్న ఈ కామన్ మొబిలిటీ కార్డుకు ఒక పేరు సూచించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ పౌరుల నుంచి పేర్లు సూచించాలని కోరుతూ ట్వీట్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని