Eluru: మహిళ కడుపులో కత్తెర వదిలేసిన వైద్యులు.. పేగు కుళ్లిందని శస్త్ర చికిత్స

ఏలూరు బోధనాసుపత్రి వైద్యుల నిర్వాకం ఓ మహిళ ప్రాణాలమీదికి తెచ్చింది.  ప్రస్తుతం బాధితురాలు విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Updated : 16 Aug 2023 17:38 IST

విజయవాడ: ఏలూరు బోధనాసుపత్రి వైద్యుల నిర్వాకం ఓ మహిళ ప్రాణాలమీదికి తెచ్చింది. బాలింత కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేయడంతో ఆమె తీవ్ర ఆనారోగ్యానికి గురైంది. ప్రస్తుతం బాధితురాలు విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈఘటనపై వైద్యలు స్పందించారు. ఈనెల 10న ఏలూరు నుంచి స్వప్న అనే మహిళను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు. సర్జికల్‌ ఫోర్‌సెప్‌ (కత్తెర)ను కడుపులో వదిలేశారని, దాని పరిమాణం రెండు ఇంచులు ఉంటుందన్నారు. కడుపులో వదిలేసిన కత్తెర పేగుకి అతుక్కుని పేగు కుళ్లిపోయిందని వైద్యులు వెల్లడించారు. విజయవాడ ఆసుపత్రికి వచ్చేసరికి రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కుళ్లిపోయిన పేగుని తీసేసి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రభాకర్‌, సర్జరీ విభాగాధిపతి అప్పారావు వివరించారు.

ఏం జరిగిందంటే?

పెదపాడు మండలం ఎస్.కొత్తపల్లి గ్రామానికి చెందిన జి.స్వప్న ప్రసవం కోసం ఏప్రిల్ 19న ఏలూరు బోధనాసుపత్రిలో చేరింది. ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. డిశ్చార్జి అయిన తర్వాత స్వప్న ఇంటికి వెళ్లిపోయింది. అయితే, తరచూ ఆమెకు కడుపు నొప్పి వచ్చేది. సాధారణంగా వచ్చే నొప్పే అనుకుని మందులు వాడేది. ఈనెల 8న స్వప్నకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో తిరిగి ఏలూరులోని బోధనాసుపత్రికి వెళ్లింది. 

అక్కడ వైద్యులు పరీక్షించి విజయవాడ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు ఎక్స్‌రే ద్వారా బయటపడింది. ఏలూరు బోధనాసుపత్రిలో సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీసిన డాక్టర్లు.. ఆపరేషన్‌కు ఉపయోగించిన కత్తెరను కడుపులో ఉంచి కుట్లు వేశారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శశిధర్‌ను వివరణ కోరగా ఈ విషయం వాస్తవమేనని తెలిపారు. ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్‌ స్పందించి విచారణ కమిటీ వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని