విశాఖ వద్దనలేదు అనే రోజొస్తుంది: అంబటి

అందరూ బాగుండాలి.. అందులో నేనూ ఉండాలనేది తమ విధానం అని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. 3 ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించి ఈ బిల్లును

Published : 21 Jan 2020 01:41 IST

అమరావతి: అందరూ బాగుండాలి.. అందులో నేనూ ఉండాలనేది తమ విధానం అని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. 3 ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించి ఈ బిల్లును తీసుకొచ్చామని అన్నారు. అందరూ నాశనం కావాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. రాజధానుల అంశంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే ఎలా? రియల్‌ ఎస్టేట్‌ అధిపతిగా చంద్రబాబు వ్యవహరించారు. మాది తుగ్లక్‌ ప్రభుత్వం అని ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి రాజధాని వదిలేసి వచ్చిన వారిది తుగ్లక్‌ పాలన కాదా? ప్రజల్ని రెచ్చగొట్టి విద్వేషాలు పెంచుతున్నారు. బినామీల పేరిట 4వేల ఎకరాలు కొనుగోలు చేశారు. అందుకే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేశారు.

మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని తరలిస్తారా? అని చంద్రబాబు అంటున్నారు. మోదీ వస్తానంటే అడ్డుకుంటామన్నది మీరు కాదా? కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. రాయలసీమలోనే శాశ్వత హైకోర్టు ఏర్పాటు చేస్తామని ఆ పార్టీనే చెప్పింది. కానీ తెదేపా నుంచి ఆ పార్టీలోకి వెళ్లిన ఓ వ్యక్తి కేంద్రం జోక్యం చేసుకుంటుందని అంటున్నారు. అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతోందని, రాజధాని రైతులు భూములు తిరిగిస్తామని అదే పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. గతంలో ఇంగ్లీషు మీడియం విషయంలో ఇలానే తెదేపా వ్యతిరేకించింది. ఆ తర్వాత మేం ఎప్పుడు వద్దన్నాం అని మాట మార్చింది. అలాగే విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా వద్దని తాము ఎప్పుడన్నాం అనే రోజు వస్తుంది. అమరావతి కోసం 24 మంది రైతులు చనిపోయారని ప్రచారం చేస్తున్నారు. గుంటూరులో ఉన్న నాకే ఆ విషయం తెలీదు. అవన్నీ అసత్య ప్రచారాలు’’ అని అంబటి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని