ఏబీ సస్పెన్షన్‌పై క్యాట్‌లో విచారణ

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ‌(క్యాట్‌)లో ఇవాళ విచారణ జరిగింది. వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది.

Published : 25 Feb 2020 00:45 IST

అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ‌(క్యాట్‌)లో ఇవాళ విచారణ జరిగింది. వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై వివరణ ఇస్తూ ఏబీ వెంకటేశ్వరరావు అఫిడవిట్‌ దాఖలు చేశారు. కనీస విచారణ లేకుండా సస్పెండ్‌ చేయడం చట్ట విరుద్ధమని ఏబీ తరఫు న్యాయవాది వాదించారు. అఖిల భారత సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్‌ చేశారన్నారు. వాదనలు విన్న క్యాట్‌.. తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.

ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్‌ డీజీగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఏబీ క్యాట్‌ను ఆశ్రయించారు. తనపై విధించిన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. గతేడాది మే 31 నుంచి వేతనం చెల్లించడం లేదని ఆయన పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలతో సస్పెండ్‌ చేయడం చట్టవిరుద్ధమని తన పిటిషన్‌లో క్యాట్‌కు తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతో జారీ చేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను కొట్టేయాలని ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని