Koppula Harishwar Reddy: ప్రభుత్వ అధికార లాంఛనాలతో హరీశ్వర్‌ రెడ్డి అంత్యక్రియలు

వికారాబాద్‌ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి తండ్రి, మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (78) (Koppula Harishwar Reddy) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.

Published : 23 Sep 2023 10:18 IST

హైదరాబాద్‌: వికారాబాద్‌ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి తండ్రి, మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (78) (Koppula Harishwar Reddy) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొప్పుల హరీశ్వర్‌రెడ్డి.. ఇటీవలే కోలుకుని ఇంటివద్దే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి భోజనానంతరం ఇంట్లోనే కళ్లు తిరిగి కిందపడిపోయారు. కుటుంబీకులు సీపీఆర్‌ చేసినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే అంబులెన్సులో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన ఉపసర్పంచిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. దశాబ్దకాలం సర్పంచిగా కొనసాగారు. 1985లో పరిగి నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1985 నుంచి 1987 వరకు ఆగ్రో ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌గా, 1987 నుంచి 1989 వరకు తితిదే సభ్యుడిగా వ్యవహరించారు. 1997 నుంచి 2000 వరకు ఆర్థిక సంస్థ ఛైర్మన్‌గా కొనసాగారు. 2012లో తెరాస (భారాస)లో చేరారు. హరీశ్వర్‌రెడ్డికి భార్య గిరిజాదేవి, కుమారులు మహేష్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, కుమార్తె అర్చనారెడ్డి ఉన్నారు.

హరీశ్వర్‌రెడ్డి కన్నుమూయడం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ప్రజలకు హరీశ్వర్‌రెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని