Hyderabad: నగరవాసులకు గుడ్‌న్యూస్‌.. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం!

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ నగర పరిధిలో నిర్మించిన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి త్వరంలో చుట్టబోతున్నట్టు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

Updated : 19 Jul 2023 22:07 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నట్టు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తోందని, ఇందులో అత్యధిక భాగం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం పూర్తి అయిందన్నారు.

మిగిలిన చోట్ల నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయన్నారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ ఒక షెడ్యూల్‌ సిద్ధం చేసింది. లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమానికి సంబంధించిన అంశంలో రెవెన్యూ యంత్రాంగం మద్దతు తీసుకొని ముందుకెళ్తోంది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎంపికను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందేలా చూడాలని మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశంలో జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మొదటి వారంలో ఇళ్ల పంపిణీ ప్రారంభం కానుంది. అక్టోబర్ మూడో వారం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 6 దశల్లో ఇప్పటికే పూర్తయిన సుమారు 70 వేల కుపైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందిస్తారు. వీటికి అదనంగా నిర్మాణం తుది దశలో ఉన్న ఇళ్లను కూడా ఎప్పటికప్పుడు ఈ పంపిణీ కార్యక్రమానికి అదనంగా జత చేసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని