ఏపీ సర్కార్‌కు సుప్రీంలో మరో ఎదురుదెబ్బ

ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం

Updated : 24 Jul 2020 15:01 IST

దిల్లీ: ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌సాల్వే వాదనలు వినిపించారు.

రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వచ్చినందున స్టే ఇచ్చేందుకు వీలు లేదని,  కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర  ప్రభుత్వం అమలు చేయటం లేదని హరీశ్‌ సాల్వే వివరించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అధికార పార్టీ నేతలు సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు కూడా చేశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ కేసుకు సంబంధించి ప్రతి విషయం మాకు తెలుసు. మేం కావాలనే ఈకేసులో స్టే ఇవ్వట్లేదు. గవర్నర్‌ లేఖ పంపినా రమేష్‌ కుమార్‌కు పోస్టింగ్‌ ఇవ్వకపోవడం అత్యంత దారుణం. కోర్టు ఉత్తర్వులే కాకుండా.. గవర్నర్‌తో కూడా చెప్పించుకోవాలా?’’ అని  సీజేఐ వ్యాఖ్యానించారు. గతంలో నిమ్మగడ్డ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా నిరాకరించామని సీజేఐ గుర్తు చేశారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే.. అది కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని సీజేఐ తెలిపారు. హైకోర్టు తీర్పు తర్వాత పరిణామాలపై అఫిడవిట్‌ దాఖలు చేస్తామని హరీశ్‌ సాల్వే కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ..పిటిషన్‌పై అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు నిమ్మగడ్డకు వారం రోజుల గడువు ఇచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని