Ap News: రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలు కాలేదు: జగన్‌

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో తిరుపతిలోని తాజ్‌ హోటల్‌లో దక్షిణాదిరాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం కొనసాగుతోంది.

Published : 15 Nov 2021 01:30 IST

తిరుపతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో తిరుపతిలోని తాజ్‌ హోటల్‌లో దక్షిణాదిరాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్‌ ప్రారంభ ఉపన్యాసం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి,  తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి, ఇంఛార్జ్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి రాజన్‌, అండమాన్ నికోబార్ ఎల్‌జీ దేవేంద్ర కుమార్ జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ సమావేశానికి హాజరయ్యారు. దక్షిణాది ప్రాంతీయ మండలి 29వ సమావేశం ఎజెండాలో మొత్తం 26 అంశాల్ని పొందుపరిచారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన చర్యల నివేదికలు రెండింటితోపాటు 24 కొత్త అంశాల్ని చర్చకు చేపడతారు.

ఏపీ సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని కోరారు. రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం... రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలు కాలేదన్నారు. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదన్నారు. పోలవరం ఖర్చు నిర్ధరణలో 2013- 2014 ధరల సూచీతో ఏపీకి అన్యాయం జరుగుతోందని, పోలవరం ఖర్చుపై విభజన చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా హామీని కూడా నెరవేర్చలేదని సమావేశం దృష్టికి తెచ్చారు. తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిలు ఇప్పించి.. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట ఇవ్వాలని కోరారు.  గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోతలు విధించటం సరికాదన్నారు. రుణాలపై కోతల అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేషన్‌ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో హేతుబద్ధత లేదని, సవరణలు చేయాల్సిన అవసరముందని సీఎం జగన్‌ అభిప్రాయ పడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని