Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Jun 2023 13:05 IST

1. భారాస ఎంపీ ఫౌండేషన్‌కు భూ కేటాయింపు.. రద్దు చేసిన హైకోర్టు

భారాస ఎంపీ, హెటిరో ఛైర్మన్‌ పార్థసారథి రెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ ఫౌండేషన్‌కు మేనేజింగ్‌ ట్రస్టీగా పార్థసారథిరెడ్డి ఉన్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఖానామెట్‌ వద్ద క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం కోసం 15 ఎకరాల భూమిని ఆ ఫౌండేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నేడే లాస్ట్‌.. ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచర్‌ పోస్టులు

ఏపీలో పెద్ద సంఖ్యలో టీచింగ్‌ పోస్టుల (Teaching Jobs) భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. పాఠశాల విద్యాశాఖలోని సమగ్రశిక్షా సొసైటీ నిర్వహించే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 1358 బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఇటీవల ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన మహిళా అభ్యర్థులు జూన్‌ 5లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విమానాన్ని వెంబడించిన ఫైటర్‌ జెట్‌.. సానిక్‌ బూమ్‌తో హడలిన వాషింగ్టన్‌

అమెరికా (USA) రాజధాని వాషింగ్టన్‌ (Washington) గగనతలంలో ఓ చిన్న విమానం తీవ్ర కలకలం సృష్టించింది. అనుమానాస్పదంగా కన్పించిన ఆ విమానాన్ని ఎఫ్‌-16 యుద్ధ విమానం (Fighter Jet) వెంబడించింది. అయితే ఈ ఫైటర్ జెట్‌ అత్యంత వేగంగా జనావాసాలపై నుంచి ప్రయాణించడంతో భారీ స్థాయిలో శబ్దాలు వినిపించాయి. దీంతో వాషింగ్టన్‌ ప్రజలు హడలిపోయారు. అసలేం జరిగిందంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పునరుద్ధరించిన పట్టాలపై గూడ్స్‌ రైలు.. ఊపిరి పీల్చుకున్న రైల్వే మంత్రి..!

ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం సంభవించగా.. మరోపక్క బోగీలు, పట్టాలు ధ్వంసమయ్యాయి. దాంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో రైల్వేశాఖ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చట్టం అందరికీ సమానమే.. రెజ్లర్లతో భేటీలో అమిత్ షా

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా ఆందోళన (Wrestlers Protest)కు దిగిన భారత అగ్రశ్రేణి రెజర్లు.. కేంద్రమంత్రి అమిత్‌ షా (Amit Shah)తో భేటీ అయ్యారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సమావేశ వివరాలు తాజాగా బయటికొచ్చాయి. బ్రిజ్‌ భూషణ్‌పై త్వరితగతిన ఛార్జ్‌షీట్‌ దాఖలయ్యేలా చూడాలని రెజ్లర్లు కేంద్రమంత్రిని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బైజూస్‌కు డెడ్‌లైన్‌.. 40 మి.డాలర్ల వడ్డీ చెల్లింపునకు నేడే గడువు

ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ (Byju's) భారీ ఎత్తున వడ్డీ చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. త్రైమాసిక చెల్లింపుల్లో భాగంగా 40 మిలియన్‌ డాలర్ల వడ్డీ చెల్లించాల్సి ఉంది. దీనికి నేడు (జూన్‌ 5) తుది గడువు. ఈ నేపథ్యంలో సకాలంలో చెల్లించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోందని ఓ ఉన్నతోద్యోగి తెలిపారు. అయితే, చివరి నిమిషంలో ప్రణాళికలో ఏమైనా మార్పులు జరిగే అవకాశమూ లేకపోలేదని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కొండపిలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో తెదేపా ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నాయుడుపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు యత్నించారు. గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వైకాపా నేతలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటి ముట్టడికి వెళ్లేందుకు టంగుటూరులోని వైకాపా కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.  కారు అద్దంలో చూస్తూ.. మోదీ డ్రైవింగ్ చేస్తున్నారు..!

ప్రధాని నరేంద్రమోదీ(PM modi), భాజపా(BJP) నేతలు ఎన్నడూ భవిష్యత్తు గురించి మాట్లాడరని, తమ వైఫల్యాలకు గత ప్రభుత్వాలపై నిందలు వేస్తుంటారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒడిశా రైలు దుర్ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ.. నిమిషం పాటు మౌనం పాటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కాబోయే వాడు మోసం చేశాడంటూ.. యువతి ఆత్మహత్య

 కర్నూలులోని ఇందిరాగాంధీ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. తనతో నిశ్చితార్థమైన యువకుడు మరో పెళ్లి చేసుకున్నాడని పద్మావతి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 9న పద్మావతికి నంద్యాల జిల్లా నందికొట్కూర్‌ నియోజకవర్గం పాతకోటకు చెందిన వినోద్‌ కుమార్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈనెల 10న వీరిద్దరికీ వివాహం జరగాల్సి ఉంది. అయితే వినోద్‌ మరో పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో మనస్తాపానికి గురైన పద్మావతి.. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సిగరెట్లు తాగొదన్నందుకు రణరంగంగా మారిన యూనివర్శిటీ..!

సిగరెట్లు తాగొద్దన్నందుకు ఏకంగా విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని విద్యార్థులు రణరంగంగా మార్చేశారు. ఈ ఘటన నోయిడాలోని గౌతమ్‌ బుద్ధ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి 33 మంది గార్డులు, విద్యార్థులను అదుపులోకి తీసుకొన్నారు. ‘విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోని మున్షీ ప్రేమ్‌ చంద్‌ హాస్టల్‌ లోపల కొందరు విద్యార్థులు ధూమపానం చేస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని