Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి

Updated : 27 Oct 2021 09:09 IST

1.డ్రగ్స్‌ రహిత రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్నాం: చంద్రబాబు

‘ఒక బాధ్యతాయుతమైన రాజకీయపార్టీగా మేము డ్రగ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌ను ఆకాంక్షిస్తున్నాం. గంజాయి, హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాల ముప్పుపై కేంద్ర ప్రభుత్వంతో పాటు పౌర సమాజాన్ని అప్రమత్తం చేస్తున్నాం...’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. దిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్లే ముందు రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ నివాసంలో మీడియాతో మంగళవారం ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

2.ఇక ప్రలోభాల వంతు!

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమరంలో కీలకమైన ప్రచార ఘట్టం బుధవారం సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఈ నెల 30న జరిగే పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంది. ఎన్నికలను ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా, కాంగ్రెస్‌లు సవాల్‌గా స్వీకరించాయి.

3.మాంసం కొనేముందు పారాహుషార్‌

వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలో ఇటీవల 4 గొర్రెలు ఆంత్రాక్స్‌ వ్యాధితో మృతి చెందడంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. ఆ చుట్టుపక్కల వందలాది గొర్రెలు, మేకలకు టీకాలు వేయడం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కడా బయటపడకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

4.పేదింట చమురు మంట
పెట్రోలు, డీజిల్‌ ధరల మంటతో సామాన్య, పేద కుటుంబాల జీవనం అస్తవ్యస్తమవుతోంది. పోషకాహారం మాట అటుంచి ఏదో విధంగా ఆకలి తీరితే చాలనే పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు పలువురు వివరించారు. ‘‘కొవిడ్‌ వంటి వాటిని ఎదుర్కోవాలంటే ఇతరత్రా జాగ్రత్తలతో పాటు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కానీ పెరిగిన కూరగాయలు, వంటనూనెలు, పప్పుల వంటివాటి ధరలతో కడుపు నిండడమే కష్టంగా ఉంది. ’’ అని పేద కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

5.ఎప్పుడైనా విరుచుకుపడొచ్చు

రష్యా, బ్రిటన్‌లలో తాజాగా కేసులు అమాంతంగా పెరుగుతుండడం, చైనాలోనూ మళ్లీ వైరస్‌ కలకలం రేపుతుండడంతో.. మూడోదశ ముప్పు త్వరలోనే భారత్‌లోనూ ఉండనుందా అనే భయాందోళనలు మొదలయ్యాయి. దేశంలో కేసులు తగ్గుముఖం పడుతుండడంతో.. కొవిడ్‌ లేదనే భావన ప్రజల్లో నెలకొంది. దీంతో మాస్కులు ధరించకపోవడం, సురక్షిత దూరాన్ని పాటించకపోవడం సాధారణమైంది.

6.యాప్‌ల ఎర... భద్రతకు చెర

దిగ్గజ సంస్థల సర్వర్ల నుంచి ప్రజల వివరాలు సేకరించి, నిధులు అపహరిస్తున్న సైబర్‌ నేరగాళ్లు కొందరైతే.. మొబైల్‌ యాప్‌ల ద్వారా వినియోగదారులకు మేలు చేస్తున్నట్లే కనిపిస్తూ, వివరాలను సంగ్రహిస్తున్న మాయగాళ్లు ఇంకొందరు. వీటితో బ్యాంకు ఖాతాల్లో సొమ్మును కొల్లగొట్టేవారు కొందరైతే... మరికొందరు ఈ సమాచారం మొత్తాన్ని తెగనమ్ముకుంటున్నారు. 

7.ప్రకృతి వైపరీత్యాలతో భారత్‌కు రూ. 6లక్షల కోట్ల నష్టం

ప్రకృతి వైపరీత్యాలు భారత్‌కు భారీ నష్టాలను మిగుల్చుతున్నాయి. అకాల వర్షాలు, వరదలు, తుపానులకు తోడు కరవు రక్కసి కారణంగా ఏటా లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. గతేడాది ప్రకృతి ప్రకోపానికి భారత్ దాదాపు రూ. 6 లక్షల కోట్ల మేర నష్టపోయినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తాజా నివేదికలో వెల్లడించింది.

8.జపాన్‌ రాకుమారి అ‘సామాన్యురాలు’

రాకుమారి పెళ్లంటే మాటలా! వైభవం ఉట్టిపడేలా వజ్ర వైఢూర్యాలతో అలంకరణలు.. రాజ భవంతిలో అంబరాన్నంటే సంబరాలు.. ధగధగలు.. విందు వినోదాలు.. కలకాలం గుర్తుండిపోయేలా ఉంటాయి. ఆమెను మనువాడే వరుడు ఇంకెంత గొప్పవాడోనన్న ఆత్రుత అందరిలోనూ కనిపిస్తుంది. కానీ, జపాన్‌ రాకుమారి మకో (30) ఇవేవీ కోరుకోలేదు! తాను ప్రేమించిన సామాన్యుడి కోసం మూడేళ్లు నిరీక్షించి, చివరికి అతడినే పెళ్లాడింది.

9.ఎలాన్‌ మస్క్‌ ఆర్జన సెకనుకు రూ.3 కోట్లు

ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ మరో ఘనత సాధించారు. అత్యంత విలువైన కంపెనీ అయిన ఎక్సాన్‌ మొబిల్‌ కార్ప్‌ కంటే, ఎలాన్‌ మస్క్‌ నికర విలువ అధికమైందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తెలిపింది. సోమవారం ఎలాన్‌ మస్క్‌ సంపద విలువ 288.6 బిలియన్‌ డాలర్ల (రూ.21.64 లక్షల కోట్ల)కు చేరుకుంది.

10.‘నేను చెప్పలేను.. నాకు తెలియదు..’

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై జస్టిస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌ మంగళవారం ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారెడ్డిని విచారించింది. పోలీస్‌ అధికారి వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కోవడం సులభంగా సాధ్యమవుతుందా? ఆయుధాన్ని వినియోగించడం తెలియని వ్యక్తి అంత సులువుగా అన్‌లాక్‌ చేయగలడా? లాంటి పలు ప్రశ్నలడిగారు. పలు సందర్భాల్లో నర్సింహారెడ్డి ‘నేను చెప్పలేను.. నాకు తెలియదు..’ అంటూ బదులిచ్చారు.

ప్రైవేట్‌ బస్సు బోల్తా: ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని