Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Updated : 07 Jul 2022 17:36 IST

1. బ్రిటన్‌ ప్రధాని రేసులో ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు

అన్నీ అనుకున్నట్లు జరిగితే బ్రిటన్‌ పాలనా పగ్గాలు భారత సంతతి వ్యక్తి చేతుల్లోకి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. వరుస వివాదాల్లో చిక్కుకున్న ప్రస్తుత ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఎట్టకేలకు అధికార పీఠం నుంచి దిగిపోయేందుకు అంగీకరించారు. దీంతో తదుపరి ప్రధాని ఎవరా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ పేరు వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే బ్రిటన్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించే అవకాశముంది. 

2. ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌!.. కేవైసీ అప్‌డేట్‌ చేశారా?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇటీవ‌ల కేవైసీ అప్‌డేట్ చేయ‌నందున ప‌లువురి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. అయితే ఖాతాల నిలిపివేత‌పై ప‌లువులు ట్విటర్‌ వేదిక‌గా ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన ఎస్‌బీఐ.. బ్యాంకు సేవ‌లు నిరంత‌రాయంగా కొన‌సాగేందుకు, ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం వినియోగదారులు వారి కేవైసీని క్రమానుగతంగా అప్‌డేట్ చేయాల‌ని తెలిపింది.

Video: చంద్రబాబు వేలికి ప్లాటినం ఉంగరం.. దాని వెనక కథేంటి?

3హైదరాబాద్‌లో ఏరోస్పేస్ యూనివర్సిటీ

రాష్ట్రంలో మరిన్ని ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ పార్కులతో పాటు పరిశ్రమ వర్గాలతో కలిసి ఏరోస్పేస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్లను తయారు చేసే ‘శాఫ్రాన్‌’ సంస్థకు చెందిన ఏరోస్పేస్‌ ఫ్యాక్టరీని శంషాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

4. ఇంటర్‌ సెకండియర్‌ ఇంగ్లిష్‌ సిలబస్‌లో మార్పులు

తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్‌ సబ్జెక్టు సిలబస్‌లో ఇంటర్‌ బోర్డు మార్పులు చేసింది. ఇంటర్ రెండో సంవత్సరానికి ఈ ఏడాది నుంచి కొత్త ఇంగ్లిష్‌ పుస్తకాలు అందించనుంది. కొత్త సిలబస్‌తో ముద్రించిన పుస్తకాలు త్వరలో బహిరంగ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్‌ వెల్లడించారు. 

5. ఆ కిచెన్‌లో లక్ష మందికి వంట చేయొచ్చు.. ప్రారంభించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తన సొంత నియోజకవర్గం వారణాసి (Varanasi)లో పర్యటిస్తున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయ ఢంకా మోగించి రెండోసారి అధికారం చేపట్టాక ఆయన తొలిసారి కాశీకి వెళ్లారు. వారణాసిలోని ఎల్‌టీ కళాశాలలో అక్షయపాత్ర మిడ్‌ డే మీల్‌ కిచెన్‌ (Akshaya Patra midday meal kitchen)ను ప్రారంభించారు. లక్ష మంది విద్యార్థులకు వంట చేసే సామర్థ్యం కలిగి ఉండటం ఈ కిచెన్‌ ప్రత్యేకత.

Video: ఈడీ దర్యాప్తు నేపథ్యంలో చైనా వెళ్లిన వీవో మొబైల్‌ కంపెనీ సిబ్బంది

6. ప్రజల్లో వ్యతిరేకత గుర్తించాకే కేంద్రం లీకేజీలు: మంత్రి జగదీశ్‌రెడ్డి

కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణల్లో మార్పుల అంశంపై తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ సంస్కరణలపై కేంద్రం తీరు మోసపూరితమేనని, ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించాకే లీకేజీలు ఇస్తోందని వ్యాఖ్యానించారు. విద్యుత్‌ సంస్కరణలపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌ గతంలోనే కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు.

7. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై నిఘా నిజం కాదా?: పయ్యావుల

ఏపీలో సమాజానికి హానికరమైన వ్యక్తులపై పెట్టాల్సిన నిఘా తెదేపా నాయకులపై నిరర్ధకంగా కొనసాగిస్తున్నారని పీఏసీ ఛైర్మన్‌, తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాజకీయ నేతలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సాక్షి పత్రిక ఉద్యోగులపై కూడా నిఘా పెట్టడం నిజంకాదా అని ప్రశ్నించారు. పెగాసస్‌ వ్యవహారంలో వైకాపాది బోగస్ ప్రచారమని ఆరోపించారు. 

‘ధోనీ’కి శుభాకాంక్షల వెల్లువ

8. భారీ వర్షాలు.. ‘మహా’ సీఎం ఇంటి చుట్టూ వరదనీరు

మహారాష్ట్ర రాజధాని ముంబయి సహా ఠాణే, పాల్ఘర్‌ తదితర జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఠాణే జిల్లాలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నివాసం చుట్టూ వరదనీరు చేరింది. మరోవైపు కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని పంజికల్‌ ప్రాంతంలో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. 

ఉద్ధవ్‌ ఠాక్రేకు చుక్కెదురు.. 66మంది కార్పొరేటర్లు శిందే క్యాంపులోకి జంప్‌

9. సిబ్బంది వేతనాలు పెంచిన ఇండిగో

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తమ ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు 8 శాతం వరకు ఉండనున్నట్లు వెల్లడించింది. కొవిడ్‌ సంక్షోభం ముగిసిన నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ తిరిగి పుంజుకొన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే సిబ్బంది జీతభత్యాలను పెంచుతున్నట్లు పేర్కొంది. అలాగే ఎక్కువ పనిగంటలు విధుల్లో ఉండే పైలట్లకు ఇచ్చే అదనపు భత్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. జులైలో సగటున రోజుకి 1,550 విమాన సర్వీసుల్ని ఇండిగో షెడ్యూల్ చేసింది.

10. ఉక్రెయిన్‌పై రష్యా వార్‌.. 346 మంది చిన్నారులు బలి!

ఉక్రెయిన్‌పై ‘సైనిక చర్య’ పేరుతో రష్యా చేస్తున్న యుద్ధంలో ఇప్పటివరకు 346 మంది చిన్నారులు బలయ్యారు. మరో 645 మంది గాయపడ్డారు. ఈ మేరకు ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే, ఇవి పూర్తి గణాంకాలు కావని.. ఇంకా మరికొన్ని ప్రాంతాల నుంచి దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సి ఉందని ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని