కరోనా మరణాల్లో మూడో స్థానానికి!

ఆదివారంనాటికి దేశంలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 63,498కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

Published : 30 Aug 2020 10:20 IST

63వేల మరణాలతో మెక్సికోకు చేరువైన భారత్‌
24గంటల్లో 78వేల కేసులు, 948 మంది మృత్యువాత

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. నిత్యం 70వేలకు పైగా కేసులు, వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో మరో 948 కరోనా రోగులు మృతిచెందారు. ఆదివారంనాటికి దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 63,498కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశాల జాబితాలో భారత్ మూడోస్థానానికి చేరింది. 63వేల కరోనా మరణాలతో ప్రపంచంలో మూడోస్థానంలో కొనసాగుతున్న మెక్సికోకు భారత్‌ చేరువయ్యింది. ఇక భారత్‌లో కరోనా కేసులు నిత్యం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వరుసగా నాలుగోరోజు 75వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా మరో 78,761పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 35లక్షల 42వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 27లక్షల మంది కోలుకోగా మరో ఏడు లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న మరో 64వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76శాతం దాటింది. మరణాల రేటు 1.8శాతంగా కొనసాగుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ తీవ్రత కొనసాగుతూనే ఉంది. జాన్స్‌ హాప్కిక్స్‌ విశ్వవిద్యాలయ నివేదిక ప్రకారం, ప్రపంచంలో కరోనా తీవ్రత అధికంగా ఐదు దేశాల వివరాలు...

దేశం     కేసుల సంఖ్య    మరణాల సంఖ్య
అమెరికా    59,60,652     1,82,760
బ్రెజిల్      38,46,153      1,20,262
భారత్‌     35,42,733        63,498
మెక్సికో     5,91,712        63,819
బ్రిటన్‌      3,34,916        41,585

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని