3కోట్ల మాస్కులు, 22,533 వెంటిలేటర్లు ఇచ్చాం!

దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది......

Published : 13 Aug 2020 16:52 IST

రాష్ట్రాలకు సాయంపై కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన

దిల్లీ: దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థంగా కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేయడంతో పాటు అవసరమైన వైద్య పరికరాలనూ సమకూరుస్తోంది. కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో మార్చి 11 నుంచి ఇప్పటివరకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసిన వైద్య పరికరాలకు సంబంధించిన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 3.04 కోట్ల ఎన్‌ 95 మాస్కులు, 1.28 కోట్లకు పైగా పీపీఈ కిట్లు, 10.83 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను ఉచితంగా ఇచ్చినట్టు తెలిపింది. అలాగే, భారత్‌లో తయారైన 22,533 వెంటిలేటర్లను సైతం పలు రాష్ట్రాలకు పంపినట్టు ప్రకటనలో పేర్కొంది. కరోనా చికిత్సకు అవసరమైన సదుపాయాలు పెంచేందుకు రాష్ట్రాలకు కేంద్రం తనవంతు సహకారం అందిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ఆరోగ్యశాఖ, టెక్స్‌టైల్‌, ఫార్మాస్యూటికల్‌ మంత్రిత్వశాఖలతో పాటు డీఆర్‌డీవో వంటి దేశీయ సంస్థల కృషితో ఈ కష్టకాలంలో దేశీయంగానే పీపీఈ కిట్లు, ఎన్‌ 95మాస్కులు, వెంటిలేటర్లు తయారు చేసుకొని సులభంగా పంపిణీ చేయగలిగినట్టు తెలిపింది. తద్వారా ఆత్మనిర్భర్‌ భారత్‌, మేకిన్‌ ఇండియా బలోపేతమైందని పేర్కొంది.

దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. నిన్న ఒక్కరోజే దాదాపు 67వేల కేసులు నమోదయ్యాయి. అలాగే, రికార్డు స్థాయిలో 56,383మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 23,96,637కి పెరిగింది. వీరిలో ఇప్పటివరకు 16,95,982మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 47వేలమందికి పైగా మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం 6,53,622 యాక్టివ్‌ కేసులు ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని