60yrs: 49శాతం మందికి తొలి డోసు పూర్తి!

దేశంలో ఇప్పటివరకు 60ఏళ్లు పైబడిన వారిలో 49శాతం మందికి తొలిడోసు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Published : 29 Jun 2021 20:01 IST

కేంద్ర ప్రభుత్వం వెల్లడి

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. మెగా డ్రైవ్‌ పేరుతో 18ఏళ్ల వయసుపైబడిన వారందరికీ ఉచితంగా టీకా అందిస్తోన్న కేంద్ర ప్రభుత్వం, నిత్యం 50లక్షలకుపైగా డోసులను పంపిణీ చేస్తోంది. ఇలా ఇప్పటివరకు 60ఏళ్లు పైబడిన వారిలో 49శాతం మందికి తొలిడోసు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

15శాతం మంది యువతకు..

‘18 నుంచి 44ఏళ్ల వయసున్న వారు దేశంలో దాదాపు 59.7కోట్ల మంది ఉండగా.. వారిలో 15శాతం మందికి తొలి డోసు అందించాం. 45 నుంచి 59 ఏళ్ల వయసున్న 20కోట్ల జనాభాలో 42శాతం మందికి మొదటి డోసు ఇచ్చాం. ఇలా అన్ని వయసుల వారికి ఇప్పటివరకు మొత్తంగా 33కోట్ల డోసులను పంపిణీ చేశాం’ అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మొత్తంగా 27కోట్ల మందికిపైగా తొలిడోసు పూర్తికాగా.. మరో 5.7కోట్ల మందికి రెండు డోసులు పూర్తైనట్లు తెలిపింది. జూన్‌ 21 నుంచి వ్యాక్సిన్‌ మెగా డ్రైవ్‌ ప్రారంభం కాగా.. నిత్యం సరాసరి 57.68లక్షల డోసులను అందిస్తోన్నట్లు తెలిపింది. మే 1నుంచి జూన్‌ 24 వరకు గ్రామీణ ప్రాంతాల్లో 24శాతం డోసులను పంపిణీ చేయగా.. పట్టణ ప్రాంతాల్లో 44శాతం వ్యాక్సిన్‌ డోసులను అందించామని పేర్కొంది.

2శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు..

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోనే ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మే 10వ తేదీన దేశంలో కరోనా గరిష్ఠ పాజిటివిటీ రేటు 21శాతంగా ఉండగా.. ప్రస్తుతం అది 2.1శాతానికి తగ్గింది. గడిచిన 22రోజులుగా రోజువారీ కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతానికి తక్కువగానే ఉంది. ఇక వారంతపు పాజిటివిటీ రేటు కూడా ప్రస్తుతం 2.7శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని