Booster dose: అలా అయితేనే బూస్టర్‌ డోసు.. ఎయిమ్స్‌ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

మూడో డోసు వినియోగంపై దిల్లీ ఎయిమ్స్‌ చీఫ్‌ రణ్‌దీప్‌ గులేరియా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి రెండు డోసులు ఎన్ని రోజులు సమర్థంగా......

Published : 24 Oct 2021 01:24 IST

దిల్లీ: దేశ ప్రజలకు బూస్టర్‌ డోసులు ఇవ్వడంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ మూడో మోతాదు అవసరమని అంతర్జాతీయ నిపుణులు చెబుతుండగా.. బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి బూస్టర్‌ డోసు అవసరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల కమిటీ వెల్లడించింది. కాగా మూడో డోసు వినియోగంపై దిల్లీ ఎయిమ్స్‌ చీఫ్‌ రణ్‌దీప్‌ గులేరియా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి రెండు డోసులు ఎన్ని రోజులు సమర్థంగా పనిచేస్తాయనే అంశంపైనే బూస్టర్‌ షాట్ వినియోగం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

మీడియాతో రణ్‌దీప్‌ గులేరియా మాట్లాడుతూ.. ‘బూస్టర్‌ డోసు వినియోగంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. యాంటీబాడీల ఆధారంగా బూస్టర్‌ షాట్‌ను ఇవ్వలేం. అది సమయం మీద ఆధారపడి ఉంటుంది. రెండో డోసు తీసుకున్న ఏడాది తర్వాత బూస్టర్‌ డోసు గురించి ఆలోచించాలి. అయితే దీనిపై మరింత సమాచారం అవసరం’ అని అన్నారు. ‘బ్రిటన్‌లో కేసులు పెరుగుతుండటాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆసుపత్రుల్లో చేరేవారు, మృతుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. బ్రిటన్‌ గతేడాది డిసెంబర్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభించింది. అంటే డిసెంబర్‌లో ఇచ్చినప్పటికీ టీకాల ప్రభావం ఇంకా వారిపై ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుంటే భారతీయులు సురక్షితంగానే అన్నట్లు అర్థం’ అని అన్నారు. అయితే వైరస్‌లో మరిన్ని మ్యుటేషన్లు ఏర్పడితే బూస్టర్‌ డోసులు తప్పనిసరి అవుతుందని పేర్కొన్నారు.

మూడో డోసు వినియోగంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు గులేరియా తెలిపారు. ఈ టీకాపై ప్రభుత్వం వచ్చే ఏడాదే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. వైరస్‌ ప్రభావం అధికంగా ఉండేవారు, వృద్ధులకే మొదట ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. పిల్లలకు వ్యాక్సిన్లపైనా గులేరియా మాట్లాడారు. చిన్నారులకు వేసే టీకాలపై ఇంకా చర్చలు సాగుతున్నాయని, అమెరికా లాంటి దేశాలు సిఫార్సు చేసిన వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని