లద్దాఖ్‌లో జెండాలతో చైనా సైన్యం నిరసన 

లద్దాఖ్‌లోని దెమ్‌చుక్‌ ప్రాంతంలోకి వచ్చి బ్యానర్లు, జెండాలతో చైనా సైన్యం నిరసన తెలిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న అక్కడి భారతీయులు

Published : 12 Jul 2021 22:34 IST

శ్రీనగర్‌: లద్దాఖ్‌లోని దెమ్‌చుక్‌ ప్రాంతంలోకి వచ్చి బ్యానర్లు, జెండాలతో చైనా సైన్యం నిరసన తెలిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న అక్కడి భారతీయులు దలైలామా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై వారు నిరసన తెలిపినట్టు సమాచారం. దలైలామా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న ప్రదేశానికి చైనా సైనికాధికారులు సహా కొందరు పౌరులు అయిదు వాహనాల్లో వచ్చారు. సింధు నదికి అవతలి ఒడ్డున నిలిచి చైనాకు సంబంధించిన బ్యానర్లు, జెండాలు చూపుతూ తమ నిరసన వ్యక్తం చేశారు.

దలైలామా 86వ పుట్టినరోజు సందర్భంగా గతవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన దలైలామాతో ఫోన్‌లో మాట్లాడినట్టు ధ్రువీకరించడం ఇదే ప్రథమం. భారత్‌-టిబెట్ విధానంలో గణనీయమైన మార్పును ప్రధాని ట్వీట్‌ చూపిస్తోందని అంతర్జాతీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. మరోవైపు చైనా కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ దేశానికి భారత్‌ శుభాకాంక్షలు తెలపకపోవడం గమనార్హం. కొవిడ్‌ ఉద్ధృతి అదుపులోకి వచ్చిన అనంతరం దలైలామా ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు టిబెట్‌ రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.

భారత్‌-చైనా మధ్య గతేడాది నుంచి సైనిక ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దశలవారీగా సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిగినప్పటికీ.. పాంగాంగ్‌ సరస్సుకు ఉత్తర, దక్షిణ ఒడ్డున పరిమిత సంఖ్యలో ఇరు పక్షాల సైనిక బలగాలను వెనక్కి తీసుకోవడం మినహా ఆశించిన పరిణామాలు చోటుచేసుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని