ఇలాగైతే కరోనా ‘వెల్‌కమ్‌’ పలకదా మరీ!

అసలే కరోనా కాలం. ఆపై ముంబయి నగరం. ఇక్కడ కొత్త కేసులు వస్తున్న తీరు భయం గొల్పుతోంది. మరణాల గురించి వింటుంటే గుండె తరక్కుపోతోంది. ఇలాంటి చోట తోటి మనిషిని తాకాలంటే.....

Published : 01 Jun 2020 00:59 IST

ముంబయి: అసలే కరోనా కాలం. ఆపై ముంబయి నగరం. ఇక్కడ కొత్త కేసులు వస్తున్న తీరు భయం గొల్పుతోంది. మరణాల గురించి వింటుంటే గుండె తరుక్కుపోతోంది. ఇలాంటి చోట తోటి మనిషిని తాకాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి చోట అదేదో జాతరకొచ్చినట్లు.. ఈ మహమ్మారి తమను ఏమీ చేయదన్నట్లు గుమిగూడారు ఆ జనం. ఏ వివాహ శుభకార్యమో అయితే ఆ ఆనందంలో మరిచిపోయారంటే ఓ అర్థం ఉంది. కానీ, కొవిడ్‌-19 నుంచి కోలుకుని వచ్చిన తమ నాయకుడి కోసం పెద్ద ఎత్తున గుమిగూడడం చూస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే!

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత చంద్రకాంత్‌ హందోరే కొవిడ్‌-19 బారిన పడ్డారు. మహమ్మారి నుంచి కోలుకుని శనివారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే పెద్ద ఎత్తున  అక్కడికి చేరుకున్న అభిమానులు.. ఆయన కారు దిగగానే ఒక్కసారిగా గుమిగూడారు. తన అభిమాన నాయకుడిని తమ సెల్‌ఫోన్లలో బంధించేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో భౌతిక దూరాన్ని మరిచారు. చాలా రోజుల తర్వాత తమ నాయకుడిని చూసే క్రమంలో మరిచిపోయారనుకున్నా.. ఆయన కూడా ఆ వైరస్‌ నుంచే కోలుకుని వచ్చారన్నది ఇక్కడ గమనించదగ్గ విషయం. మరికొందరైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బాణసంచా కాల్చారు కూడా.

ఇప్పటికే ముంబయిలో కరోనా కేసుల సంఖ్య 39 వేలకు చేరువైంది. మహారాష్ట్ర వ్యాప్తంగా 65వేలు దాటింది. రోజూ వందలాది కేసులు వెలుగుచూస్తున్నాయి. 100కు పైగానే మరణాలు సంభవిస్తున్నాయి. అయినా, వీరిలో భయాందోళన కనిపించకపోవడం ఆశ్చర్యం గొలుపుతోంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని