ఓవైపు రాజకీయ సంక్షోభం.. మరోవైపు ఐటీ సోదాలు

రాజస్థాన్‌ రాజకీయాల్లో తలెత్తిన సంక్షోభం ఓవైపు మరింత ముదురుతున్న సమయంలో.. రాష్ట్రంలో పలుచోట్ల ఐటీ దాడులు జరగడం కలకలం రేపుతోంది. దాదాపు 200 మంది ఆదాయ పన్ను శాఖ అధికారులు సోమవారం..........

Updated : 13 Jul 2020 12:49 IST

జైపుర్: రాజస్థాన్‌ రాజకీయాల్లో తలెత్తిన సంక్షోభం ఓవైపు మరింత ముదురుతున్న సమయంలో.. రాష్ట్రంలో పలుచోట్ల ఐటీ దాడులు జరగడం కలకలం రేపుతోంది. దాదాపు 200 మంది ఆదాయ పన్ను శాఖ అధికారులు సోమవారం రంగంలోకి దిగారు. సీఎం గహ్లోత్‌కు సన్నిహితులైన ఇద్దరు కాంగ్రెస్‌ నాయకులకు చెందిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కాంగ్రెస్‌ నాయకుడు ధర్మేందర్‌ రాథోడ్‌కు చెందిన దాదాపు 12 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు అధికారులు తెలిపారు. అలాగే ప్రముఖ నగల వ్యాపారి రాజీవ్‌ అరోరా ఇంట్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వీరివురు గహ్లోత్‌కు అత్యంత సన్నిహితులని చెబుతుంటారు. 

జైపుర్‌, కోటా, దిల్లీ, ముంబయిలో ఇరువురు నాయకులకు చెందిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పన్ను ఎగవేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలోనే సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా దేశం వెలుపల చేసిన లావాదేవీలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు.

ఓవైపు రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా స్పందిస్తూ.. ‘‘తొలుత భాజపాకు చెందిన లాయర్లు రంగంలోకి దిగారు. ఇప్పుడు జైపుర్‌లో ఐటీ శాఖ దాడులు ప్రారంభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎప్పుడు రాబోతోంది?’’ అని ట్వీట్‌ చేశారు.

ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ తిరుగుబాటుతో రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం  తెలిసిందే. ప్రస్తుతం సీఎం గహ్లోత్‌ నివాసంలో సీఎల్పీ సమావేశం జరుగుతోంది. ఏం నిర్ణయించబోతున్నారు.. ఎలా ముందుకుసాగనున్నారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని