లాలూ బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు.. నగదు, బంగారం స్వాధీనం

రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో ఆ శాఖ మాజీ మంత్రి లాలూప్రసాద్‌ బంధువులు, ఆర్జేడీ నేతల ఇళ్లు, ప్రాంగణాల్లో ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహించింది.

Updated : 11 Mar 2023 03:32 IST

 రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో మనీలాండరింగ్‌పై దృష్టి

దిల్లీ/ పట్నా: రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో ఆ శాఖ మాజీ మంత్రి లాలూప్రసాద్‌ బంధువులు, ఆర్జేడీ నేతల ఇళ్లు, ప్రాంగణాల్లో ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహించింది. కేంద్ర బలగాల రక్షణ మధ్య దిల్లీ, బిహార్‌, ముంబయిలో మొత్తం 25 చోట్ల ఇవి జరిగాయి. ఈ తనిఖీల్లో రూ.53 లక్షలు, 1,900 డాలర్ల నగదు, 540 గ్రాముల బంగారు బిస్కెట్లు, కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ దిల్లీలో లాలూ కుమారుడు, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ బసచేసిన ఒక నివాసంలోనూ సోదాలు జరిగాయి. అక్రమ నియామకాల వ్యవహారంలో ‘లబ్ధి పొందిన కంపెనీ’గా చెబుతున్న ఏకే ఇన్ఫోసిస్టమ్స్‌.. ఈ ఇంటి చిరునామాతోనే రిజిస్టర్‌ అయిందని ఈడీ అధికారులు చెప్పారు. లాలూ కుటుంబం దీన్ని నివాస ప్రాంగణంగా ఉపయోగించుకుంటోందని వివరించారు. లాలూ కుమార్తెలు రాగిణి యాదవ్‌, చందా యాదవ్‌, హేమా యాదవ్‌, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే సయ్యద్‌ అబు దోజానా, అమిత్‌ కత్యాల్‌, నవ్‌దీప్‌ సర్దానా, ప్రవీణ్‌ జైన్‌లకు సంబంధించిన ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి. బ్రహ్మ సిటీ, ఎలీట్‌ ల్యాండ్‌బేస్‌, వైట్‌లాండ్‌ కార్పొరేషన్‌, మెరిడియన్‌ కన్‌స్ట్రక్షన్‌ ఇండియా లిమిటెడ్‌ వంటి సంస్థల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ కేసుతో ముడిపడ్డ మనీలాండరింగ్‌ వ్యవహారాలపై దర్యాప్తులో భాగంగా ఈ చర్యను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సోదాలపై ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా మండిపడ్డారు. ‘కొందరి స్క్రిప్ట్‌’ ఆధారంగా సీబీఐ, ఈడీలు విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నాయన్నారు.  2004 నుంచి 2009 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భారతీయ రైల్వేలో ‘గ్రూప్‌-డి’ ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ ఆరోపించింది. నాడు ఉద్యోగాలు పొందినవారు లాలూ, అతని కుటుంబసభ్యులకు, ఏకే ఇన్ఫోసిస్టమ్స్‌ సంస్థకు భూములను లంచంగా ఇచ్చారని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి లాలూను, ఆయన సతీమణి రబ్రీదేవిని సీబీఐ ఇటీవల ప్రశ్నించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని