నౌకపై నౌక.. చెన్నై పోర్టు తడాఖా!

భారత నౌకా పరిశ్రమ గర్వించేలా చెన్నై పోర్టు తన పనితనంతో తడాఖా చూపింది. ఓ భారీ వస్తువును బార్జి(పెద్ద పంటు)పై అమర్చే ‘ఫ్లోట్ ఆన్‌ - ఫ్లోట్ ఆఫ్‌(ఫ్లో-ఫ్లో)’ పద్ధతిని విజయవంతంగా పూర్తి చేసింది.

Updated : 31 Mar 2023 08:33 IST

‘ఫ్లోట్‌ ఆన్‌- ఫ్లోట్‌ ఆఫ్‌’లో సరికొత్త రికార్డు
భారీ ఓడను గయానాకు సాగనంపిన అధికారులు

ఈనాడు, చెన్నై: భారత నౌకా పరిశ్రమ గర్వించేలా చెన్నై పోర్టు తన పనితనంతో తడాఖా చూపింది. ఓ భారీ వస్తువును బార్జి(పెద్ద పంటు)పై అమర్చే ‘ఫ్లోట్ ఆన్‌ - ఫ్లోట్ ఆఫ్‌(ఫ్లో-ఫ్లో)’ పద్ధతిని విజయవంతంగా పూర్తి చేసింది. అరుదుగా చేపట్టే ఈ క్రతువును పూర్తి చేసిన పోర్టు అధికారులు, ఇంజినీర్లను ప్రధాన మంత్రి మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. పోర్టులు, షిప్పింగ్‌ రంగానికి ఇదో గొప్ప శుభవార్త అని కొనియాడారు.

ఎలా చేర్చారంటే..

బార్జి మధ్య ప్లాట్‌ఫాంను సముద్రం నీటిలో మునిగేలా చేశారు. ఓడను నీటి మార్గాన తీసుకెళ్లి సరిగ్గా.. బార్జి ప్లాట్‌ఫాంపై కూర్చునేలా నిలిపారు. ఆ తర్వాత ముంచి ఉంచిన ప్లాట్‌ఫాం భాగాన్ని పైకి లేపారు. దాంతో ఓడ.. బార్జిలోకి వచ్చినట్లయింది. వెంటనే భారీ దూలాలతో ఓడను కదలకుండా బిగించేశారు. ఈ తంతు పూర్తికి 12 గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందని పోర్టు అధికారులు తెలిపారు. ఇందుకు బార్జిలో ఓడ కోసం ప్రత్యేక ప్లాట్ఫాంను తయారు చేసినట్లు వివరించారు. ఇది ఓ రికార్డు అని, ‘మేకిన్‌ ఇండియా’ సాధించిన ఘనతగా పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

విశేషం ఏంటీ..?

285 మీటర్ల పొడవు, 43 మీ వెడల్పు, 14.2 మీ ఎత్తుతో 17 వేల టన్నుల బరువున్న ‘ఎంవీ మలీషా’ అనే ఓడను ఉన్నది ఉన్నట్లు చెన్నై నుంచి 14 వేల కి.మీ దూరంలోని రిపబ్లిక్‌ ఆఫ్‌ గయానా దేశానికి తరలించాలి. అందుకు.. ముందుగా దాన్ని భారీ పంటుపై అమర్చాలి. ఇది అంత సులువైన పనికాదు. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించి చెన్నై పోర్టు ఈ బాధ్యతను తీసుకుంది. అరుదైన ఫ్లోట్ ఆన్‌ - ఫ్లోట్ ఆఫ్‌ విధానాన్ని ఎంచుకొని.. ఇటీవలే దిగ్విజయంగా పంటుపైకి ఓడను చేర్చి ఆ దేశానికి సాగనంపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని