Vaccine: థర్డ్‌వేవ్‌ ఆపాలంటే.. ఈ వేగం సరిపోదా?

ఎక్కువ జనాభాకు వ్యాక్సిన్‌ పంపిణీ చేయడం ద్వారా మూడో ముప్పు ప్రభావాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Published : 06 Jul 2021 15:25 IST

నిత్యం 80లక్షల నుంచి కోటి డోసులు పంపిణీ చేయాల్సిందే అంటున్న నిపుణులు

దిల్లీ: కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతితో వణికిపోయిన భారత్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో ముప్పు ప్రభావం ఉందని నిపుణులు హెచ్చరించడంతో.. దానిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా థర్డ్‌వేవ్‌ ముప్పు ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ అధికారులు, ఆరోగ్య నిపుణులు, టీకా తయారీదారులు విశేష కృషి చేస్తున్నారు. ఎక్కువ జనాభాకు వ్యాక్సిన్‌ పంపిణీ చేయడం ద్వారా మూడో ముప్పు ప్రభావాన్ని తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సిన్‌ పంపిణీ వేగాన్ని మరింత పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

నిత్యం కోటి డోసుల పంపిణీ లక్ష్యం..

కరోనా థర్డ్‌ వేవ్‌ అనివార్యమైనప్పటికీ సాధ్యమైనంత వరకు దానిని నివారించాలంటే దేశ జనాభాలో దాదాపు 60శాతం మందికి రెండు డోసులు అందించాల్సి ఉంది. ఇందులో భాగంగా ప్రభుత్వం కూడా ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించుకుంది. అయితే, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇప్పటినుంచి దాదాపు ప్రతిరోజు కనీసం 80లక్షల డోసులు పంపిణీ చేయాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రతిరోజు కోటి 25లక్షల డోసులు పంపిణీ చేసే సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని.. అయినప్పటికీ నిత్యం కనీసం కోటి మందికి వ్యాక్సిన్‌ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా ఈమధ్యే పేర్కొన్నారు. జులై నుంచి వేగాన్ని పెంచాలని అనుకున్నప్పటికీ ప్రస్తుతం ప్రతిరోజు 40లక్షల డోసులను మాత్రమే పంపిణీ చేయగలుగుతున్నారు. ఇదే వేగంతో పంపిణీ చేస్తే ప్రభుత్వం పెట్టుకున్న డిసెంబర్‌ లక్ష్యాన్ని చేరుకునేది కష్టంగానే కనిపిస్తోంది.

రోజువారీ సరాసరి 40లక్షల డోసులు..

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ మెగా డ్రైవ్‌ ప్రారంభమైనప్పటి నుంచి వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ పెరిగింది. గతనెల చివరి వారంలో నిత్యం 80లక్షల డోసులను పంపిణీ చేశారు. తర్వాత అది 40లక్షలకు తగ్గింది. ఇక గత ఆదివారంనాడు కేవలం 15లక్షల డోసులను మాత్రమే పంపిణీ చేయగలిగారు. ఇలా వారంలో సరాసరిగా కేవలం 40లక్షల డోసులను మాత్రమే అందిస్తున్నారు. కొన్ని చోట్ల వ్యాక్సిన్‌ల కొరత, మరికొన్ని చోట్ల స్థానిక ప్రభుత్వాల వైఫల్యం కారణంగా అధికమొత్తంలో వ్యాక్సిన్‌ పంపిణీ చేయకపోవడానికి కారణాలని నిపుణులు అంచనా వేస్తున్నారు.

జులైలో 12కోట్ల డోసులే..

పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ వేగంగా కొనసాగుతున్నప్పటికీ మరికొన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్‌ల కొరత వేధిస్తోంది. దీంతో తమకు ఎక్కువ డోసులను పంపిణీ చేయాలని ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో జులైలో కేవలం 12కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, కేంద్రప్రభుత్వం ఉచితంగా ఇచ్చే డోసులకు అదనంగా మరో 25శాతం ప్రభుత్వ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. అందుకు తగ్గట్లుగానే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

వ్యాక్సిన్‌ల కొరతే కారణమా..?

దేశంలో కరోనా వ్యాక్సిన్‌లకు ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు టీకా కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పంజాబ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలు తమకు ఎక్కువ డోసులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయినప్పటికీ రాష్ట్రాల వద్ద ఇంకా 2కోట్ల డోసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది. ఇదే సమయంలో దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో తయారీ సంస్థలు వేగం పెంచాయి. కొవిషీల్డ్‌ తయారుచేస్తోన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ కేవలం జూన్‌ నెలలోనే దాదాపు 10కోట్ల డోసులను కేంద్ర ప్రభుత్వానికి అందించినట్లు తెలిపింది. అటు భారత్‌ బయోటెక్‌ కూడా ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీటితో పాటు స్పుత్నిక్‌ టీకా డోసుల ఉత్పత్తిని పెంచేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ఇతర సంస్థల సహకారం తీసుకొంటోంది. ఇక మోడెర్నా టీకాను భారత్‌లో దిగుమతి చేసుకునేందుకు ఇప్పటికే అనుమతి లభించింది. ఇలా స్థానికంగా ఉత్పత్తిని పెంచడంతో పాటు, దిగుమతి పెరిగితేనే భారత్‌లో వ్యాక్సిన్‌ డోసులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 35కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని