Corona: కొత్త కేసులు 37వేలు.. ఒక్క కేరళలోనే 24 వేలకుపైగా..

కరోనా రెండో దశ విజృంభణ నుంచి దక్షిణాది రాష్ట్రం కేరళ ఇంకా బయటపడట్లేదు. ఇటీవల అక్కడ వైరస్‌ వ్యాప్తి తగ్గినట్లే కన్పించినా తాజాగా మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి

Updated : 25 Aug 2021 10:55 IST

మొత్తం కేసుల్లో 65శాతం ఒక్క ఆ రాష్ట్రంలోనే..

దిల్లీ: కరోనా రెండో దశ విజృంభణ నుంచి దక్షిణాది రాష్ట్రం కేరళ ఇంకా బయటపడట్లేదు. ఇటీవల అక్కడ వైరస్‌ వ్యాప్తి తగ్గినట్లే కన్పించినా తాజాగా మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వెలుగుచూసిన మొత్తం కొత్త కేసుల్లో దాదాపు 65శాతం ఒక్క ఆ రాష్ట్రంలోనే బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

కేరళలో మళ్లీ 24వేల పైన..

గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 37,593 మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారు. క్రితం రోజు(25,467)తో పోలిస్తే ఈ సంఖ్య 47.6శాతం ఎక్కువ కావడం గమనార్హం. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.25కోట్లు దాటింది. అయితే తాజా కేసుల్లో 64.6శాతం కేసులు ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. నిన్న ఆ రాష్ట్రంలో 24,296 కొత్త కేసులు వెలుగుచూశాయి. మే 26(28,798 కేసులు) తర్వాత కేరళలో 24వేల పైన కేసులు నమోదవడం మళ్లీ ఇప్పుడే.

600 దాటిన మరణాలు..

ఇక దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య మళ్లీ 600 దాటింది. నిన్న 648 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. కేరళలో 173 మంది మృతిచెందారు. వైరస్‌ దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4,35,758 మంది కొవిడ్‌కు బలయ్యారు. ఇక 24 గంటల వ్యవధిలో మరో 34,169 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.17కోట్ల మంది కరోనాను జయించగా.. రికవరీ రేటు 97.67శాతానికి చేరింది.

1శాతం దిగువనే క్రియాశీల రేటు..

మరోవైపు వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడంతో దేశంలో క్రియాశీల రేటు 1శాతం దిగువకు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,22,327 మంది కరోనాతో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.99శాతంగా ఉంది. ఇక దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 61,90,930 మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఇప్పటివరకు 59.55కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని