తొలిసారి ఓటు వేయలేకపోయిన ములాయం

దేశంలో కరోనా వ్యాప్తి విశృంఖలంగా కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా రోజూ 2లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. వైద్య సదుపాయాల కొరతకు తోడు నానాటికీ.....

Published : 20 Apr 2021 01:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా వ్యాప్తి విశృంఖలంగా కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా రోజూ 2లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. వైద్య సదుపాయాల కొరతకు తోడు నానాటికీ మరణాల సంఖ్యా పెరుగుతుండటం తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నా వైరస్‌ ప్రళయం కొనసాగుతుండటంతో.. మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో అసాధారణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.  

తొలిసారి ఓటేయలేకపోయిన ములాయం
లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ తొలిసారి తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఆయన తన స్వగ్రామం సైఫాయిలో ఓటు వేసేందుకు వెళ్లలేదు. 81 ఏళ్ల ములాయం సింగ్‌ యాదవ్‌ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ  ఓటు వేయడం తప్పలేదని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దిల్లీలో ఉన్న ములాయం సింగ్‌ను ఈసారి ఓటు వేసేందుకు రావొద్దని తామే కోరామని, అదృష్టవశాత్తు ఆయన అంగీకరించారని ములాయం బంధువు ధర్మేంద్ర యాదవ్‌ తెలిపారు. యూపీలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ సోమవారం జరిగింది. 

దిల్లీలో మెట్రో రైళ్లు తిరుగుతాయ్‌..
దిల్లీ: దిల్లీలో సోమవారం రాత్రి 10గంటల నుంచి ఏప్రిల్‌ 26 ఉదయం 5గంటల వరకు పూర్తి లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల సేవలు అందుబాటులోనే ఉంటాయని దిల్లీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. రద్దీ అధికంగా ఉన్న సమయాలైన  ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు; అలాగే, సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ప్రతి 30 నిమిషాలకు రైళ్లు నడుస్తాయని స్పష్టంచేసింది.  మిగతా సమయాల్లో మాత్రం ప్రతి 60 నిమిషాలకు రైళ్లు నడపనున్నట్టు తెలిపింది. 50శాతం సిటింగ్‌సామర్థ్యంతోనే రైళ్లు నడుపుతున్నట్టు స్పష్టంచేసింది. 

వీసా సర్వీసులు నిలిపివేస్తున్నాం.. రష్యా ఎంబసీ!
దిల్లీ: కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో భారత్‌లోని వీసా  సర్వీసుల విభాగాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు రష్యా ఎంబసీ కార్యాలయం వెల్లడించింది. తదుపరి నోటీసు ఇచ్చేవరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ట్విటర్‌లో తెలిపింది. 

పెళ్లిళ్లకు 20మంది మించొద్దు!
చండీగఢ్‌: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్షించిన సీఎం అమరీందర్‌ సింగ్‌ రాత్రిపూట కర్ఫ్యూ వేళల్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. గతంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు అమలులో ఉన్న రాత్రిపూట కర్ఫ్యూ సమయాన్ని రాత్రి 8గంటల నుంచి ఉదయం 5గంటల వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. రేపట్నుంచి ఈ నెల 30 వరకు జిమ్‌లు, కోచింగ్ సెంటర్లు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు మూసివేస్తున్నట్టు తెలిపారు. అలాగే, వివాహాలు, అంత్యక్రియలకు 20మందికి మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. 

రాత్రి 8కల్లా రెమిడెసివిర్‌ నాగ్‌పుర్‌కు పంపండి

ముంబయి: కరోనా ఉగ్రరూపం కొనసాగుతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు నాగ్‌పుర్‌ బెంచ్‌ కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ రోజు రాత్రి 8గంటల కల్లా కరోనా నియంత్రణ ఔషధం రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను పంపాలని ఆదేశించింది. కరోనాతో అల్లాడుతున్న నాగ్‌పూర్‌ నగరానికి 10వేల రెమ్‌డిసివిర్‌ ఇంజెక్షన్లు పంపాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని