కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా స్టార్‌ హోటళ్లు..!

మహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోన్న వేళ.. కొన్ని స్టార్‌ ఆసుపత్రులను కూడా కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చేందుకు బీఎంసీ అధికారులు సిద్ధమయ్యారు.

Published : 13 Apr 2021 01:10 IST

ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం
కొవిడ్‌ పడకల పెంపుపై పలు రాష్ట్రాల దృష్టి

ముంబయి: దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి మరోసారి కొనసాగుతోన్న వేళ.. కొవిడ్‌ ప్రత్యేక ఆసుపత్రులపై ఆయా రాష్ట్రాలు దృష్టి సారించాయి. కొవిడ్‌ రోగులతో ఆసుపత్రుల్లో రద్దీ ఎక్కువ అవుతుండడంతో వారికి వైద్య సదుపాయం కలిగించేందుకు మరిన్ని ప్రత్యేక పడకలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రైవేటు ఆసుపత్రులు, హోటళ్లను కూడా కొవిడ్‌ రోగుల వైద్య సేవలకోసం వినియోగించాలని ఆదేశిస్తున్నాయి.

కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా స్టార్‌ హోటళ్లు..!

కరోనా వైరస్‌ విలయానికి మహారాష్ట్ర వణికిపోతోంది. నిత్యం కొత్తగా 50వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడంతో ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో 2వేల పడకల సామర్థ్యం కలిగిన మూడు ప్రత్యేక కొవిడ్‌ ఆసుపత్రులకు అందుబాటులోకి తెచ్చేందుకు ముంబయి అధికారులు సిద్ధమయ్యారు. వీటితో పాటు కొన్ని స్టార్‌ ఆసుపత్రులను కూడా కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యుల సహకారంతో ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని బృహన్‌ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఐఎస్‌ చాహల్‌ వెల్లడించారు.

మరో మూడు వారాల్లో 2వేల పడకల సామర్థ్యం కలిగిన మూడు కొవిడ్‌ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురావాలని మహారాష్ట్ర అధికారులు నిర్ణయించారు. ప్రతి కేంద్రంలో 200 ఐసీయూ పడకలు, 70శాతం ఆక్సిజన్‌ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా ఏర్పాటు చేసేందుకు పలు స్టార్‌ హోటళ్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. కొవిడ్‌ ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో అవసరమైన రోగులకు వైద్య సదుపాయాలను సమకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ముంబయిలో 141 ఆసుపత్రుల్లో 19వేల పడకలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 2466 ఐసీయూ పడకలు ఉండగా.. త్వరలోనే మరిన్ని ఐసీయూ పడకలను సిద్ధం చేస్తామన్నారు.

ప్రైవేటు ఆసుపత్రులకు పిలుపు..

కరోనా తీవ్రత కొనసాగుతోన్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్థానికంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్‌ రోగులతో నిండిపోతున్నాయి. దీంతో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రైవేటు ఆసుపత్రులు ముందుకు రావాలని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమయ్యే స్థలాన్ని ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పారు. తద్వారా వీలైనన్నీ కొవిడ్‌ ప్రత్యేక పడకలను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. వీటితో పాటు మరో 2వేల ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం ఆర్డర్‌ ఇచ్చామని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ వెల్లడించారు.

అవసరమైతే తప్ప ఆసుపత్రికి వెళ్లొద్దు..

దేశ రాజధానిలోనూ కొవిడ్‌ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఈ సమయంలో దిల్లీలో కొవిడ్‌ ఆసుపత్రులను పెంచాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు చాలా ప్రైవేటు ఆసుపత్రులను మరోసారి కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చాలన్నారు. ప్రస్తుతానికి దాదాపు 115 ప్రైవేటు ఆసుపత్రుల్లో సగం పడకలను కొవిడ్‌ రోగులకు కేటాయించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అవసరమైతే తప్ప కరోనా రోగులు ఆసుపత్రులకు వెళ్లకూడదని సూచించారు. ప్రస్తుతం దిల్లీలో 5525 కొవిడ్ పడకలు ఉన్నాయని..రానున్న రోజుల్లో మరిన్ని అందుబాటులోకి తెస్తామని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. నగరంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10వేలు దాటడం ఆందోళనకర విషయమని ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని కేజ్రీవాల్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని