UGC: వర్సిటీల్లో అక్టోబర్‌ 1నుంచి కొత్త విద్యా సంవత్సరం

కరోనా వైరస్‌ ప్రభావంతో విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది. పిల్లల చదువులు సరిగా సాగకపోవడంతో వారి భవిష్యత్తుపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021-22 విద్యా సంవత్సరాన్ని.......

Updated : 27 Feb 2024 17:17 IST

యూజీసీ కొత్త గైడ్‌లైన్స్‌ విడుదల

దిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావంతో విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది. పిల్లల చదువులు సరిగా సాగకపోవడంతో వారి భవిష్యత్తుపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021-22 విద్యా సంవత్సరాన్ని గాడిన పెట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కొత్త నిబంధనలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కళాశాలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం, ప్రవేశాలు, పరీక్షలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. అక్టోబర్‌ 1నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని స్పష్టంచేసింది. యూజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను సెప్టెంబర్‌ 30 నాటికి పూర్తి చేయాలంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, రాష్ట్రాల బోర్డులు 12వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసిన తర్వాతే యూజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించాలని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించింది.  అన్ని బోర్డులకు సంబంధించి 12వ తరగతి పరీక్షా ఫలితాలు జులై 31వరకు విడుదలవుతాయని భావిస్తున్నట్టు పేర్కొంది. అర్హత పరీక్షల ఫలితాల వెల్లడిలో ఏదైనా జాప్యం జరిగితే కొత్త విద్యా సంవత్సరం అక్టోబర్‌ 18 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. 

కళాశాలల్లో విద్యాబోధన, అభ్యాసన ప్రక్రియ ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ లేదా మిశ్రమ పద్ధతుల్లో తప్పనిసరిగా కొనసాగాల్సిందేనని యూజీసీ ఆదేశించింది. విద్యా సంస్థల్లో తరగతులు, పరీక్షల నిర్వహణ, సెమిస్టర్‌ విభజన తదితర అంశాలన్నింటినీ అక్టోబర్‌ 1 నుంచి జులై 31 మధ్య ఉండేలా తగిన ప్రణాళిక సిద్దంచేసుకోవాలని సూచించింది. కరోనా కట్టడిపై కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు వ్యవహరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఎవరైనా అడ్మిషన్‌ రద్దు లేదా మైగ్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి పూర్తి మొత్తాన్ని రిఫండ్‌ చేయాలని ఉన్నత విద్యా సంస్థలకు ఆదేశాలు జారీచేసింది. యూనివర్సిటీలు, కళాశాలలు ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలను ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌/ మిశ్రమ పద్ధతుల్లో ఆగస్టు 31నాటికి నిర్వహించాలని సూచించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని