America: భారత్‌-అమెరికా యుద్ధవిన్యాసాలు.. చైనాకు అనవసరం

భారత్‌-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంపై భారత్‌లో అమెరికా దౌత్యవేత్త ఎలిజబెత్‌ జోన్స్‌ స్పందించారు.‘‘ ఇది వారికి అనవసం’’ అంటూ సైనిక విన్యాసాల్లో చైనా తలదూర్చడాన్ని ఆమె కొట్టిపారేశారు.

Published : 03 Dec 2022 01:18 IST

దిల్లీ: ఉత్తరాఖండ్‌లోని ఔలిలో భారత్‌-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంపై భారత్‌లో అమెరికా దౌత్యవేత్త ఎలిజెబెత్‌ జోన్స్‌ స్పందించారు. ‘‘ఇది వారికి అనవసం’’ అంటూ సైనిక విన్యాసాల్లో చైనా తలదూర్చడాన్ని ఆమె కొట్టిపారేశారు. మరోవైపు డ్రాగన్‌ వ్యాఖ్యలపై భారత్‌ కూడా ఘాటుగా స్పందించింది. ‘‘భారత్‌ తనకు నచ్చిన వారితో యుద్ధ విన్యాసాలు చేస్తుంది. ఇందులో మూడో దేశం తలదూర్చేందుకు ఎలాంటి అధికారం లేదు’’ అని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా, భారత్‌ మధ్య వ్యాపార లావాదేవీలు గడిచిన ఏడేళ్లలో రెట్టింపు అయ్యాయని జోన్స్‌ తెలిపారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య వర్తకం 157 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు చెప్పారు. రెండు నెలల క్రితం భారత్‌లో తాత్కాలిక దౌత్యవేత్తగా నియమితులైన ఆమె.. దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కెన్నెత్‌ జస్టర్‌ తర్వాత అమెరికా.. భారత్‌లో శాశ్వత దౌత్యవేత్తను నియమించడం లేదు. కెన్నెత్‌ తర్వాత ఇప్పటి వరకు ఐదుగురు తాత్కాలిక దౌత్యవేత్తలుగా పని చేశారు. జోన్స్‌ గతంలో పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, యూరప్‌లో దౌత్యవేత్తగా సేవలందించారు.

మరోవైపు భారత్‌ రాజకీయాలపైనా జోన్స్‌ స్పందించారు. ఎదుటివారిని పరోక్షంగా విమర్శించే భారత్‌ రాజకీయ నాయకులు వాక్చాతుర్యాన్ని ఎలిజెబెత్‌ జోన్స్‌ కొనియాడారు. వారి మాటకారితనం గురించి కార్యాలయంలో ప్రతిరోజూ చర్చిస్తామన్నారు. ఈ తీరును అమెరికా ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రసంగాన్ని ఆమె ఉటంకించారు. గుజరాత్‌లో అమిత్‌షా పర్యటిస్తూ 2002 అల్లర్ల గురించి ప్రస్తావించారు. అప్పట్లో గందరగోళ పరిస్థితుల కారణంగా అభివృద్ధికి ఆస్కారం ఏర్పడలేదని, ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వారిని జైల్లో పెట్టి తగిన గుణపాఠం చెప్పామని అన్నారు. ఇక్కడ ఆయన ఏ సామాజిక వర్గం వర్గం పేరును ప్రస్తావించకుండానే.. అల్లర్లకు ముస్లింలే కారణమంటూ తాను చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పేశారని జోన్స్‌ అన్నారు. ఇలాంటి ప్రసంగాల వల్ల ప్రజల్లో ఆలోచించే స్వభావం పెరుగుతుందని, తద్వారా ప్రశ్నించేతత్వం అలవాటవుతుందని ఆమె అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని