Pakistan: భారత్‌ ‘ఏజెంట్‌ మిశ్రా’ను పాక్‌ గుర్తుపట్టేసింది..!

ఇమ్రాన్‌ ఖాన్‌ మంత్రివర్గంలో కామెడీ చేసేవారికి కరవేలేదు. వీలైనప్పుడల్లా ఒళ్లుదాచుకోకుండా వినోదాన్ని పంచుతారు.

Updated : 26 Sep 2021 13:02 IST

* ఫవాద్‌ చౌధరీ మరో కామెడీ

* ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మంత్రివర్గంలో కామెడీ చేసేవారికి కరవేలేదు. వీలైనప్పుడల్లా వినోదాన్ని పంచుతారు. ఆ తర్వాత నెటిజన్లు వీరిని ఒక ఆట ఆడుకుంటారు. ఇది షరా మాములైపోయింది. తాజాగా ఈ సారి ఆ దేశ సమాచార మంత్రి ఫవాద్‌ చౌధరీ వంతు వచ్చింది. పాక్‌లో న్యూజిలాండ్‌ పర్యటన రద్దుకావడానికి భారతే కారణమని ఆయన ఇటీవల ఆరోపించారు. భారత్‌ నుంచి వెళ్లిన బెదిరింపుల కారణంగా న్యూజిలాండ్‌ పర్యటనను రద్దు చేసుకొందని విశ్లేషించారు. మార్టిన్‌ గప్తిల్‌ భార్యకు బెదింరిపులతో కూడిన ఈమెయిల్‌ పంపించడంతోనే ఈ టూర్‌ రద్దయిందని తెలిపారు.

మంత్రిగారు సెలవిచ్చిన కారణాలు..

* భారత్‌లోని ఒక ఆంగ్ల పత్రికలో న్యూజిలాండ్‌ జట్టుపై దాడి జరగడానికి ఉన్న అవకాశాలను విశ్లేషిస్తూ ఆగస్టు 21న వ్యాసం ప్రచురితమైంది. న్యూజిలాండ్‌ జట్టు పర్యటన రద్దు చేసుకోవడానికి గల కారణాల్లో ఇది ఒకటిని పాక్‌ మంత్రి ఫవాద్‌ చౌధరీ పేర్కొన్నారు.

* ఇక ఓం ప్రకాశ్‌ మిశ్రా అనే వ్యక్తి పాక్‌లోని తెహ్రీక్‌ ఈ తాలిబన్‌ పేరిట ముంబయిలో ఓ తప్పుడు ఐడీ సృష్టించాడని పేర్కొన్నారు. దీనిలో వీపీఎన్‌ వాడి సింగపూర్‌లో ఉన్నట్లు లోకేషన్‌ చూపించాడన్నారు. హమ్జా అఫ్రిదీ పేరిట న్యూజిలాండ్‌ క్రికెటర్‌ మార్టిన్‌ గప్తిల్‌ భార్యకు బెదింరింపుల ఈమెయిల్‌ పంపించారు. ఈ క్రమంలో  ఓం ప్రకాశ్‌ మిశ్రా ఫొటోను కూడా పాక్‌ మంత్రి ప్రదర్శించారు. ఈ ఫోటోను చూడగానే మంత్రిగారు ఏదో కామెడీ షో చేస్తున్నారని నెటిజన్లకు అర్థమైపోయింది. 

ఎవరీ ఓం ప్రకాశ్‌ మిశ్రా..?

ఓం ప్రకాశ్‌ మిశ్రా సోషల్‌ మీడియాలో ఓ ర్యాపర్‌. 2017లో  ‘బోలోనా ఆంటీ’ అంటూ ఇతను చేసిన ఓ వెకిలి ర్యాప్‌ సాంగ్‌ సోషల్‌ మీడియాలో హాస్యాన్ని పండించింది. అప్పట్లో యూట్యూబ్‌ రోస్టర్లు ఈ పాటను రోస్టింగ్‌ చేశారు. అతేకాదు అతను ఓ మీమ్‌ మెటీరియల్‌గా మారిపోయాడు. ఇతనిది ఉత్తర్‌ ప్రదేశ్‌లోని పూర్వాంచల్‌ ప్రాంతం. తాజాగా ఓం ప్రకాశ్‌ మిశ్రా పేరును ఫవాద్‌ చౌధరీ ఈ వివాదంలోకి లాగారు. దీంతో అతడి పేరు ట్విటర్‌లో ట్రెండింగ్‌ కావడం మొదలైంది.

మిశ్రా మెయిల్‌కు ‘ఫైవ్‌ ఐస్‌’ భయపడుతుందా..?

ఫైవ్‌ ఐస్‌ అనేది ఐదు దేశాలు కలసి సమష్టిగా ఏర్పాటు చేసుకొన్న ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌. దీనిలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లు సభ్య దేశాలు. సముద్రాలపై నిఘా, కోవర్ట్‌  సమాచారం, హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సమాచారం సేకరిస్తాయి. వీటిని మిత్రదేశాలతో పంచుకొంటాయి. సీఐఏ,ఎంఐ వంటి కాకలు తీరిన సంస్థలు ఇందులో పనిచేస్తాయి. అలాంటి బృందంలోని సభ్యదేశమైన న్యూజిలాండ్‌ ర్యాపర్‌ మిశ్రా బెదిరింపు మెయిల్‌కు భయపడి మూటాముల్లె సర్దుకొంటుందా..? జనం తన మాటలు నమ్ముతారని ఫవాద్‌ ఛౌదరీ ఎలా అనుకున్నారో..?

వాచాలత్వానికి పెట్టింది పేరు.. ఫవాద్‌ చౌధరీ..!

2020లో ఈయన ఓ ట్వీట్‌ చేశారు. అందులో భారత్‌ పేరును, లాక్‌డౌన్‌ స్పెల్లింగ్‌ను కూడా తప్పుగా రాశారు. అప్పట్లో ఈయన గారు పాకిస్థాన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మినిస్టర్‌గా కూడా పనిచేశారు. 2019 అక్టోబర్‌లో ఆయన ఓ విచిత్రమైన ట్వీట్‌ చేశారు. లాహోర్‌లో వాయు కాలుష్యం పెరగడానికి భారత్‌ కారణమని ఆరోపించారు. దిల్లీ నుంచి అమృత్‌సర్‌ వరకు పంటలను దహనం చేయడం వల్ల పాకిస్థాన్‌లోని లాహోర్‌లో కాలుష్యం పెరిగిందని సెలవిచ్చారు. దీనిని నియంత్రించడంలో మోదీ సర్కారు విఫలమైందని కూడా మండిపడ్డారు.

* ‘‘భారత్‌లోకి వెళ్లి మరీ కొట్టాం’’ అంటూ పుల్వామా దాడి పాక్‌పనే అని అంగీకరించేలా ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రేలిస్ట్‌లో ఉన్న పాక్‌ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లైంది. ఆ తర్వాత  ఫవాద్‌ మాటమార్చారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని పేర్కొన్నారు. తాను ఎఫ్‌-16 విమానాలు భారత్‌లో ప్రవేశించిన అంశాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు.

ఉగ్రవాదులు పెంచేది పాక్‌.. దాడుల బాధ్యత భారత్‌దా..?

లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ ఇంటివద్ద జూన్‌ 23వ తేదీన బాంబుదాడి భారత్‌ పనే అని పాక్‌ అధ్యక్షుడు ఆరీఫ్‌ అల్వీ ఆరోపించారు. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు పలు గ్రూపులతో వివాదాలు ఉన్నాయి. ఆ తర్వాత పాక్‌లోనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

* ఇటీవల పాక్‌లోని దసు డ్యామ్‌ వద్ద ఒక బస్సును ఉగ్రవాదులు పేల్చేశారు. అందులో భారీ సంఖ్యలో చైనీయులు మృతి చెందారు. తొలుత బాంబు పేలుడు కాదని బుకాయించిన పాక్‌ ఆ తర్వాత అది ఆత్మాహుతి దాడిగా అంగీకరించింది. దీనికి భారత్‌, అఫ్గానిస్థాన్‌లను తప్పుబట్టింది. కానీ, పాక్‌లోని టీటీపీ ఉగ్రవాద సంస్థ దీనికి బాధ్యత తీసుకొంది.

* ఐక్యరాజ్య సమితి వేదికగా కూడా అబద్ధాలు చెప్పిన ఘన చరిత్ర పాక్‌కు ఉంది. 2017లో ఐరాసలో పాక్‌ శాశ్వత ప్రతినిధి మలేహా లోధి మాట్లాడుతూ.. కశ్మీర్‌ భారత్‌ సైన్యం పిల్లెట్‌ గన్‌ వాడటంతో గాయపడిన యువతి అంటూ ఓ ఫొటోను ఐరాసలో ప్రదర్శించారు. ఆ తర్వాత భారత ప్రతినిధి పౌలమీ త్రిపాఠీ మాట్లాడుతూ లోధి ప్రదర్శించిన ఫొటో పాలస్తీనా బాలికదని నిరూపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని