మార్స్‌పై రోవర్‌ ‘టెస్ట్‌ డ్రైవ్‌’.. అద్భుతం!

అంగారకుడిపైకి నాసా ప్రయోగించిన రోవర్‌ ‘పర్సెవరెన్స్‌’ మరో కీలక ముందడుగు సాధించింది. అంగారక గ్రహంపై తొలిసారి విజయవంతంగా ‘టెస్ట్‌ డ్రైవ్‌’ చేపట్టింది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా శుక్రవారం వెల్లడించింది.

Updated : 06 Mar 2021 12:13 IST

వాషింగ్టన్‌: అంగారకుడిపైకి నాసా ప్రయోగించిన రోవర్‌ ‘పర్సెవరెన్స్‌’ మరో కీలక ముందడుగు సాధించింది. అంగారక గ్రహంపై తొలిసారి విజయవంతంగా ‘టెస్ట్‌ డ్రైవ్‌’ చేపట్టింది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా శుక్రవారం వెల్లడించింది. ‘ఆరు చక్రాలు కలిగిన రోవర్‌ ‘పర్సెవరెన్స్‌’ అంగారకుడిపై విజయవంతంగా ప్రయాణం (టెస్ట్‌ డ్రైవ్‌) చేసింది. 33 నిమిషాల వ్యవధిలో 6.5 మీటర్ల (21.3ఫీట్‌) దూరం ప్రయాణించింది. నాలుగు మీటర్లు ముందుకు ప్రయాణించి.. 150 డిగ్రీల ఎడమవైపునకు  తిరిగి వెనక్కి మరో 2.5 మీటర్లు ప్రయాణించింది’ అని నాసా వెల్లడించింది. ఇందుకు సంబంధించి రోవర్‌ పంపిన చిత్రాల్లో.. అది తిరిగిన ప్రదేశాల్లో ట్రాక్‌ జాడలు స్పష్టంగా కనిపిస్తుండటం విశేషం. 

‘అంగారకుడిపై రోవర్‌ ప్రయాణించిన తీరు అద్భుతం. రోవర్‌ చక్రాలను నడిపించేందుకు మాకు లభించిన తొలి అవకాశం ఇది. ఈ మిషన్‌లో ఇదో కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. త్వరలో రోవర్‌తో కొన్ని దూర ప్రయాణాలు కూడా చేయించనున్నాం. అంగారకుడి ఉపరితలంపై అది తిరగడానికి అవకాశం ఉన్న ప్రదేశాలపై పరిశోధిస్తున్నాం. ’ అని పర్సవరెన్స్‌ మొబిలిటీ టెస్ట్‌ బెడ్‌ ఇంజినీర్‌ అనైస్‌ జరిఫ్యాన్‌ వెల్లడించారు. ‘నాసా చేపట్టిన మార్స్‌ మిషన్‌లో ఇప్పటి వరకు పెద్దగా ఎలాంటి అవరోధాలు ఎదుర్కోలేదు. పూర్తయినంత వరకూ అద్భుతంగానే జరిగింది’ అని పర్సవరెన్స్‌ డిప్యూటీ మిషన్‌ మేనేజర్‌ రాబర్ట్‌ హాగ్‌ తెలిపారు. 

అంగారక గ్రహంపై జీవం పుట్టుక గురించి పరిశోధించేందుకు అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 2020లో రోవర్‌ను పంపిన విషయం తెలిసిందే. ఆ రోవర్‌ గతనెల 18న అంగారకుడిపై విజయవంతంగా కాలు మోపింది. రాబోయే రోజుల్లో మార్స్‌పై ఉండే రాళ్లు, మట్టి నమూనాలను రోవర్‌ సేకరించి భూమికి పంపుతుందని నాసా గతంలో తెలిపింది. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని