Ayodhya: ప్రపంచ రికార్డుకు సిద్ధమైన అయోధ్య

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు అయోధ్య నగరం సిద్ధమైంది. దీపావళి ముందురోజైన బుధవారం సరయు నదీతీరంలోని....

Updated : 03 Nov 2021 16:14 IST

అయోధ్య: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు అయోధ్య నగరం సిద్ధమైంది. దీపావళి ముందురోజైన బుధవారం సరయు నదీతీరంలోని రామ్‌కీ పైడి ఘాట్‌లో 9 లక్షల దీపాలు వెలిగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. గతేడాది వెలిగించిన 6 లక్షల దీపాల రికార్డును అధిగమించబోతున్నట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది. అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేయనున్నట్లు తెలిపింది. ‘రామ్‌కీ పైడి ఘాట్‌లో 9 లక్షల దీపాలతో పాటు, అయోధ్య పట్టణమంతటా దీపాలు వెలిగించే కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. అయోధ్యతోపాటు యావత్ ప్రపంచానికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ ప్రయత్నం చేస్తున్నాం’ అని అయోధ్య జిల్లా కలెక్టర్‌ నితీశ్‌ కుమార్‌ వెల్లడించారు. గత కొన్ని రోజులుగా సరయు నదీతీరంలో అయోధ్య చరిత్రను తెలిపే లేజర్ షోలు నిర్వహిస్తున్నారు. రామ మందిరంతోపాటు నగరంలోని ఇతర ప్రదేశాల ఇతివృత్తాలతో బుధవారం మధ్యాహ్నం టేబులాక్స్‌తో కవాతు కూడా ప్లాన్ చేశారు.

ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు మందిరానికి సంబంధించిన అన్ని బాధ్యతలను నిర్వహిస్తోంది. కాగా రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫేజ్‌-1 పనులు పూర్తవ్వగా.. ఫేజ్‌-2 పనులు నవంబరు చివరి నాటికి ముగియనున్నట్లు తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. డిసెంబర్‌ 2023 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని తెలిపింది. అదే ఏడాది ఆలయంలో శ్రీరాముని మూలవిరాట్టు ప్రతిష్ఠాపన చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన టెంపుల్‌ ఆర్కిటెక్ట్స్‌ ‘సోమ్‌పురా ఫ్యామిలీ’ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలను స్వీకరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని