Taiwan: తైవాన్‌పై డ్రాగన్‌ ‘గ్రేజోన్‌ వార్ఫేర్‌’..!

 చైనా మరోసారి తైవాన్‌పై కవ్వింపు చర్యలకు దిగింది. ఈ సారి 19 యుద్ధవిమానాల దండు తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ ఐడెంటిఫికేషన్‌ జోన్‌లోకి ప్రవేశించింది. ఇప్పటికే ఈ ఏడాది పలు మార్లు చైనా విమానాలు తైవాన్‌ గగనతల రక్షణ వ్యవస్థ పరిధిలోకి చొరబడ్డాయి.

Updated : 06 Sep 2021 16:54 IST

* ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి చైనా న్యూక్లియర్‌ బాంబర్లు..!  

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

చైనా మరోసారి తైవాన్‌పై కవ్వింపు చర్యలకు దిగింది. ఈ సారి 19 యుద్ధవిమానాల దండు తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ ఐడెంటిఫికేషన్‌ జోన్‌లోకి ప్రవేశించింది. ఇప్పటికే ఈ ఏడాదిలో పలు మార్లు చైనా విమానాలు తైవాన్‌ గగనతల రక్షణ వ్యవస్థ పరిధిలోకి చొరబడ్డాయి. తైవాన్‌ ఈ అంశంపై పలు మార్లు ఫిర్యాదులు కూడా చేసింది. చైనా యుద్ధవిమానాల్లో వాయుసేనకు చెందిన హెచ్‌-6 న్యూక్లియర్‌ బాంబర్లు కూడా ఉన్నాయి. ఈ విమానాలు యాంటీ సబ్‌మెరైన్‌ ఆపరేషన్లు కూడా నిర్వహిస్తాయి. చైనా విమానాలు ప్రయాణించిన ఫ్లైట్‌పాత్‌ మ్యాప్‌ను తాజాగా తైవాన్‌ మంత్రి విడుదల చేశారు. చైనా విమానాలను గుర్తించిన వెంటనే మిస్సైల్‌ వ్యవస్థను అప్రమత్తం చేయడంతోపాటు తైవాన్‌ విమానాలు గాల్లోకి ఎగిరాయి. ఈ విషయాన్ని చైనా అధికారికంగా వెల్లడించలేదు.

రికార్డు స్థాయి చొరబాట్లు..

చైనా ఈ ఏడాది రికార్డు స్థాయిలో తైవాన్‌ గగనతల రక్షణ వ్యవస్థలోకి చొరబడింది. ఆగస్టు చివరి వారం వరకు 393 చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన వాయుసేన, నావికాదళ యుద్ధ విమానాలు వెళ్లాయి. 1990ల్లో తైవాన్‌ మిస్సైల్‌ సంక్షోభం తర్వాత పరిస్థితి ఎప్పుడూ ఇంత తీవ్రంగా లేదు. ఇటీవల తరచూ పదుల సంఖ్యలో చైనా యుద్ధ విమానాలు తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ ఐడెంటిఫికేషన్‌ జోన్‌లోకి ప్రవేశించి కవ్విస్తున్నాయి. తైవాన్‌పై గ్రేజోన్‌ వార్ఫేర్‌ వ్యూహాన్ని అనుసరించాలని చైనా కొన్నేళ్ల క్రితం నిర్ణయించుకుంది. ఇటీవల కాలంలో దానిని మరింత తీవ్రం చేసింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఐరోపా పర్యటన సమయంలో అత్యధికంగా 28 యుద్ధవిమానాలు తైవాన్‌ ఏడీఐజెడ్‌ పరిధిలోకి వెళ్లాయి.

వ్యూహాత్మక విమానాల సంచారం..

చైనా గ్రేజోన్‌ వార్ఫేర్‌ కోసం కీలకమైన యాంటీ సబ్‌మెరైన్‌ వార్ఫేర్‌కు వినియోగించే షాంక్సీ వై-8 వేరియంట్‌ను వినియోగిస్తోంది. ఇది చాలా నిదానంగా ప్రయాణిస్తుంది. వీటిని యాంటీ సబ్‌మెరైన్‌ వార్ఫేర్‌, ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ కోసం వినియోగిస్తారు. అందుకే తైవాన్‌ నేరుగా యుద్ధవిమానాలను వీటి వద్దకు పంపకుండా.. ఉపరితలం మీద నుంచి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలతో ట్రాక్‌ చేస్తోంది. దీంతోపాటు రేడియో సిగ్నల్స్‌లో హెచ్చరికలు జారీ చేస్తోంది.

నైరుతి తైవాన్‌పైనే గురి ఎందుకు..

చైనా యుద్ధవిమానాలు తరచూ తైవాన్‌ నైరుతి ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని చొరబాట్లకు పాల్పడుతున్నాయి. దీనికి చైనా లక్ష్యాలు వేరే ఉన్నాయి. అమెరికాతో సంబంధాలను పునఃసమీక్షించుకుంటుందని డ్రాగన్‌ భావిస్తోంది. అదే సమయంలో దక్షిణ చైనా సముద్రంలోని బాషి ఛానల్‌లో తన ఏ2/ఏడీ (ఏరియా యాక్సెస్‌ అండ్‌ ఏరియా డినైల్‌)సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటోంది.

గ్రేజోన్‌ వార్ఫేర్‌ ఎందుకు..?

గత కొన్నేళ్లుగా తైవాన్‌ను వేధించడమే లక్ష్యంగా చైనా యుద్ధవిమానాలను పంపిస్తోంది. ‘తొలిసారి ఢీ కోవడమే తుది పోరును తలపించాలి’ అనే పీఎల్‌ఏ  లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తోంది. ఈ విషయాన్ని పీఎల్‌ఏ డైలీ తొలిసారి బాహ్యప్రపంచానికి వెల్లడించింది. ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకుండా వదిలేస్తే అంతర్జాతీయ సమాజం జోక్యం పెరిగిపోతుందని చైనా అంచనా వేసింది. అదే సమయంలో చైనాలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు కూడా రావచ్చు. అందుకే వీలైనంత త్వరగా గ్రేజోన్‌ వ్యూహాలను అమల్లోకి తెచ్చింది.

ఒక వేళ యుద్ధం అంటూ వస్తే తైవాన్‌ జలసంధి చాలా కీలకం అవుతుంది. అందుకే ఈ ప్రదేశంపై తిరుగులేని పట్టు సాధించేందుకు గ్రేజోన్‌ వార్ఫేర్‌ చైనాకు ఉపయోగపడుతుంది. తైవాన్‌ నిఘా వ్యవస్థలు పెద్దగా సచేతనంగా లేని బ్లైండ్‌ స్పాట్లను గుర్తించేందుకు దీనిని వాడతారు.

ఇలాంటి బ్లైండ్‌ స్పాట్లను ఉపయోగించి యుద్ధ సమయంలో తైవాన్‌ వేగంగా స్పందించే లోపే దాడులు చేయవచ్చు. లేదా తైవాన్‌ సైనిక రవాణా, నిర్వహణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి వాడుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని