Palm oil production: పామాయిల్‌ సాగు సాయం పెంపు.. ₹11,040 కోట్లతో కేంద్రం ప్యాకేజీ

పామాయిల్‌ సాగుకు రూ.11వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. రూ.11,040 కోట్లు కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

Updated : 18 Aug 2021 17:21 IST

దిల్లీ: విదేశాల నుంచి వంట నూనెల దిగుమతులను తగ్గించడంతో పాటు ఆయిల్‌ పామ్‌ సాగులో స్వయం సమృద్ధి సాధించే కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. రాబోయే ఐదేళ్లలో దేశంలో ఆయిల్‌ పామ్‌ సాగును విస్తృతం చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌-ఆయిల్‌ పామ్‌ (NMEO-OP) పథకం కింద రూ.11,040 కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశం కేబినెట్‌ సమావేశం వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ మీడియాకు వివరించారు.

వంట నూనెల కోసం విదేశాలపై భారీగా ఆధారపడడం తగ్గించి, దేశీయంగా ఉత్పత్తిని పెంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తోమర్‌ వివరించారు. ఇందుకోసం రాబోయే ఐదేళ్లలో రూ.11,040 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. NMEO- OP కింద ఆయిల్‌ పామ్‌ సాగుదారులకు గిట్టుబాటు ధరకు హామీ ఇస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పామాయిల్‌ సాగుదారులకు హెక్టార్‌కు ఇస్తున్న సబ్సిడీని రూ.12వేల నుంచి రూ.29 వేలకు పెంచుతున్నట్లు వివరించారు. అలాగే 15 హెక్టార్లకు కోటి రూపాయల వరకు సాయం అందించనున్నట్లు చెప్పారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని ఈశాన్య ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ పునరుజ్జీవనానికి  రూ.77.45 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని