ఆ 256 మంది.. కోటీశ్వరులైన ‘పేదవాళ్లు’..!

ఒకరు ఛాయ్‌ - సామోసా అమ్ముకునే వ్యక్తి.. మరొకరు ఛాట్‌ బండితో బతుకు బండి లాగిస్తున్న మనిషి.. ఇంకొకరు పండ్లమ్ముకుంటూ పొట్టనింపుకుంటున్న పేదవాడు..! ఇదంతా కేవలం పైకి కన్పించేదే.

Updated : 22 Jul 2021 15:38 IST

కాన్పూర్‌ చిరు వ్యాపారులకు కోట్లలో ఆదాయం

(ప్రతీకాత్మక చిత్రం)

కాన్పూర్‌: ఒకరు ఛాయ్‌ - సమోసా అమ్ముకునే వ్యక్తి.. మరొకరు ఛాట్‌ బండితో బతుకు బండి లాగిస్తున్న మనిషి.. ఇంకొకరు పండ్లమ్ముకుంటూ పొట్టనింపుకుంటున్న పేదవాడు..! ఇదంతా కేవలం పైకి కన్పించేదే. రోడ్ల పక్కన ఏళ్ల తరబడి చిరువ్యాపారాలు సాగిస్తున్న వీరి ఆదాయం లక్షలు, కోట్లలో ఉంది. కొందరి వద్ద ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉండగా.. మరికొందరికి వందల ఎకరాల్లో సాగు భూమి ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పేదలుగా పరిగణిస్తున్న చిరువ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు జరపగా.. దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ 250 మందికి పైగా చిరువ్యాపారుల కోటీశ్వరులేనని తేలింది. 

ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిలో కోటీశ్వరులున్నట్లు తరచూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే, తాజాగా కాన్పూర్‌ ఏకంగా 256 మంది చిరువ్యాపారులకు కోట్ల రూపాయాల్లో ఆస్తిపాస్తులున్నట్లు ఐటీ శాఖ దర్యాప్తులో వెల్లడైంది. వీరంతా ఆదాయపు పన్నులు చెల్లించడం లేదు సరికదా.. జీఎస్‌టీ పరిధిలో లేకపోవడం గమనార్హం. కాన్పూర్‌లోని కొందరు స్క్రాప్‌ డీలర్ల వద్ద మూడేసి కార్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక లాల్‌బంగ్లా ప్రాంతంలోని ఓ స్క్రాప్‌ డీలర్‌, బెకోన్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు గత రెండేళ్లలో రూ.10కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. 

ఈ వ్యాపారులు జీఎస్‌టీలో నమోదు చేసుకోలేదు సరికదా.. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదని అధికారులు గుర్తించారు. ఈ 256 మంది చిరు వ్యాపారులు గత నాలుగేళ్లలో రూ.375 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆర్యనగర్‌, స్వరూప్‌ నగర్‌, బృహానా రోడ్డు వంటి ఖరీదైన కమర్షియల్‌ ప్రాంతాల్లోనే ఈ ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. కరోనా మహమ్మారితో యావత్‌ భారతం విలవిల్లాడుతున్న సమయంలో ఆర్యనగర్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు పాన్‌ షాపు యజమానులు, స్వరూప్‌ నగర్‌లో ఒక పాన్‌ దుకాణాదారుడు రూ.5కోట్ల విలువైన ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. మాల్‌రోడ్డు ప్రాంతంలో ఓ చిరుతిళ్ల వ్యాపారి పలు ప్రాంతాల్లోని తన బండ్లకు నెలకు రూ. 1.25లక్షల అద్దె చెల్లిస్తున్నట్లు తేలింది. ఓ ఛాట్‌ వ్యాపారికి పెద్ద ఎత్తున భూములు ఉన్నట్లు తెలిసింది. 

ప్రభుత్వం కన్నుకప్పడానికి కొందరు చిరువ్యాపారులు సహకార బ్యాంకులు, చిన్న మొత్తాల పథకాల సాయం తీసుకుంటున్నారని, మరికొందరు తమ బంధువుల పేర్లతో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని ఐటీ శాఖ దర్యాప్తులో తేలింది. అయితే, వీరి పాన్‌ కార్డులు, ఆధార్‌ కార్డులను పరిశీలించగా.. ఈ ఆస్తుల చిట్టా బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లో గతంలోనూ ఇలాంటి కోటీశ్వరులైన ‘పేదవాళ్లు’ గురించి పలుమార్లు కథనాలు వెలుగులోకి వచ్చాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని