Farmers: దిల్లీలో మళ్లీ కదం తొక్కిన రైతన్నలు

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొద్ది నెలలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో ప్రశాంతంగా ఆందోళన సాగిస్తున్న రైతన్నలు నేడు మరోసారి కదం తొక్కారు. దిల్లీ నడిబొడ్డున

Published : 22 Jul 2021 10:24 IST

జంతర్‌మంతర్‌కు అన్నదాతలు.. భద్రత పెంపు

దిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొద్ది నెలలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో ప్రశాంతంగా ఆందోళన సాగిస్తున్న రైతన్నలు నేడు మరోసారి కదం తొక్కారు. దిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్‌మంతర్‌ వద్ద నేటి నుంచి ఆందోళన చేపట్టనున్నారు. ‘కిసాన్‌ సంసద్‌(రైతుల పార్లమెంట్‌)’ పేరుతో నిర్వహించే ఈ నిరసన కార్యక్రమానికి సరిహద్దుల నుంచి అన్నదాతలు బస్సుల్లో ర్యాలీగా వెళ్లనున్నారు. 

జంతర్‌ మంతర్‌ వద్ద కిసాన్‌ సంసద్‌ నిర్వహించుకునేందుకు దిల్లీ ప్రభుత్వం నిన్న అనుమతినిచ్చింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. దీంతో గురువారం రైతులు సరిహద్దుల నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. ఇప్పటికే సింఘు సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున రైతులు గుమిగూడారు. పోలీసు ఎస్కార్ట్‌ నడుమ 200 మంది బస్సుల్లో వెళ్లి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టనున్నారు. 

అయితే, ఈ జంతర్‌మంత్‌ పార్లమెంట్‌కు కొద్ది మీటర్ల దూరంలోనే ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంట్‌లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జంతర్‌మంతర్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా సిబ్బంది భారీగా మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటు సరిహద్దుల్లోనూ భద్రతను పెంచారు. టిక్రి సరిహద్దుల్లో ఆందోళనకు అనుమతినివ్వకపోవడంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. 

వర్షాకాల సమావేశాలయ్యేంత వరకు ఆందోళన..

ఆందోనల్లో పాల్గొనేందుకు బీకేయూ నేత రాకేశ్‌ టికాయత్‌ సింఘు సరిహద్దుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత 8 నెలలుగా మేం ఇక్కడ ఉద్యమం సాగిస్తున్నాం. శాంతియుతంగానే నిరసన చేపడుతూ ప్రభుత్వం ముందు మా డిమాండ్లు ఉంచాం. ఇప్పుడు జంతర్‌మంతర్‌ వద్ద కిసాన్‌ పార్లమెంట్‌ నిర్వహించతలపెట్టాం. ఇందుకోసం 5 బస్సుల్లో రైతులు అక్కడకు వెళ్లి ప్రతి రోజూ నిరసన చేస్తారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేంత వరకు మేం అక్కడే ఉంటాం’’ అని చెప్పుకొచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని