Afghan crisis: ఉగ్రదాడి ముప్పు పొంచి ఉంది.. అక్కడి నుంచి వెళ్లిపోండి..!

ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందని, వెంటనే కాబుల్ విమానాశ్రయ పరిసర ప్రాంతాలను వీడండంటూ గురువారం అమెరికా, సహా పలు పాశ్చాత్య దేశాలు తమ ప్రజలను కోరాయి. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయగా.. తమ పౌరుల భద్రత గురించి పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

Updated : 26 Aug 2021 15:19 IST

కాబుల్ విమానాశ్రయం ఖాళీ చేయాలని తమ పౌరుల్ని కోరిన దేశాలు

కాబుల్‌: ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందని, వెంటనే కాబుల్ విమానాశ్రయ పరిసర ప్రాంతాలను వీడండంటూ గురువారం అమెరికా, సహా పలు పాశ్చాత్య దేశాలు తమ ప్రజలను కోరాయి. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. తమ పౌరుల భద్రత గురించి పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

కొద్ది రోజుల క్రితం అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశమైంది. దాంతో అక్కడి నుంచి తమ పౌరులు, సైనిక సిబ్బంది, శరణార్థుల తరలింపు ప్రక్రియను పశ్చిమ దేశాలు వేగవంతం చేస్తున్నాయి. ఆగస్టు 31 నాటికి బలగాల ఉపసంహరణ గడువుకు ముందు సాధ్యమైనంత ఎక్కువ మందిని తరలించాలని చూస్తుండటంతో.. భారీగా ప్రజలు కాబుల్ విమానాశ్రయ సమీపంలో గుమిగూడుతున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. 

‘భద్రతా కారణాల దృష్ట్యా విమానాశ్రయం సమీపంలో ఉన్నవారంతా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలి’ అని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తమ పౌరులను హెచ్చరించింది. ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందని ఆస్ట్రేలియా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విమానాశ్రయం వద్దకు వెళ్లొద్దని తమ ప్రజలకు సూచించింది. ‘ఇతర మార్గాల ద్వారా అఫ్గానిస్థాన్‌ నుంచి సురక్షితంగా బయటపడగలిగితే.. వెంటనే ఆ పని చేయండి’ అంటూ బ్రిటన్ తన పౌరులను అప్రమత్తం చేసింది. అఫ్గానిస్థాన్‌ నుంచి తరలివెళ్లే ఉద్దేశంతో సుమారు 10 వేల మందికిపైగా ప్రజలు కాబుల్ విమానాశ్రయంలో వేచిచూస్తున్నారని యూఎస్ ఆర్మీ మేజర్ జనరల్ విలియం టేలర్ మీడియాకు వెల్లడించారు. ఆ తరుణంలోనే పలు దేశాల నుంచి ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. 

ఇదిలా ఉండగా.. 24 గంటల వ్యవధిలో 19వేల మందిని తరలించినట్లు పెంటాగన్ పేర్కొంది. అలాగే ఇప్పటి వరకు 80 వేల మందికి పైగా విదేశీయులు, అఫ్గాన్‌ వాసుల్ని తరలించినట్లు చెప్పింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని