choksi: ఛోక్సీని కిడ్నాప్‌ చేయాల్సిన ఖర్మ మాకేంటి?

పంజాబ్‌ బ్యాంకు కుంభకోణం కేసు నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని డొమినికా పోలీసులు కిడ్నాప్‌ చేశారనడాన్ని ఆ దేశ ప్రధాని రూజ్‌వెల్డ్‌ స్కిర్రిట్‌ కొట్టిపారేశారు. ఇవన్నీ అర్థంలేని ఆరోపణలన్నారు....

Published : 03 Jul 2021 01:15 IST

డొమినికా ప్రధాని రూజ్‌వెల్డ్‌ స్కిర్రిట్‌

డొమినికా: పంజాబ్‌ బ్యాంకు కుంభకోణం కేసు నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని డొమినికా పోలీసులు కిడ్నాప్‌ చేశారనడాన్ని ఆ దేశ ప్రధాని రూజ్‌వెల్డ్‌ స్కిర్రిట్‌ కొట్టిపారేశారు. ఇవన్నీ అర్థంలేని ఆరోపణలన్నారు. ఇటీవల ఆంటిగ్వా నుంచి కనిపించకుండా పోయిన ఛోక్సీ అక్కడికి రెండు రోజుల తర్వాత డొమినికా సముద్ర తీరంలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఆయన డొమినికా జైలులో ఉన్నారు. దీనిపై స్కిర్రిట్‌ మాట్లాడుతూ.. ‘‘ఛోక్సీ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. వీలైనంత త్వరగా దీనిపై విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరాం. అయితే  ఆయన హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూసుకుంటాం’’ అని అన్నారు.

భారత్‌, డొమినికా కలిసి ఛోక్సీని ఆంటిగ్వా నుంచి కిడ్నాప్‌ చేశారన్న వాదనలను స్కిర్రిట్‌ కొట్టి పారేశారు. ఛోక్సీని కిడ్నాప్‌ చేయాల్సిన అవసరం అటు భారత్‌కు గానీ, ఇటు ఆంటిగ్వా, డొమినికాకు కూడా లేదన్నారు. దేశాభివృద్ధి కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని,  ఇలాంటి చిన్నచిన్న విషయాల్లో అసలు తల దూర్చబోమని స్పష్టం చేశారు.  ‘‘ఈ దేశంలో ఎవర్నో హత్యచేసి పక్కదేశానికి పారిపోయి హాయిగా బతుకుంటే.. అలా వదిలేస్తామా? లేదా తిరిగి డొమినికాకు పట్టుకొచ్చి శిక్షిస్తామా?’’ అని ఆయన ప్రశ్నించారు. 

డొమినికాకు చెందిన ఓ పౌరుడ్ని అమెరికాకు అప్పగిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా స్కిర్రిట్‌ ఉటంకించారు.  ఇలాంటి నిర్ణయాలే మెహుల్‌ ఛోక్సీపైనా తప్పవని ఆయన పరోక్షంగా చెప్పారు. డొమినికా... డబ్బున్న వారిని, లేనివారిని వేర్వేరుగా చూడలేదని స్కిర్రిట్‌ వ్యాఖ్యానించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, దానికి పేద, ధనిక తారతమ్యాలు ఉండవని అన్నారు. ఛోక్సీ అంశం ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉందని, న్యాయస్థానాలే నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని