US Visa: వీసా రెన్యువల్‌కు నో మెయిల్‌.. ఓన్లీ డ్రాప్‌ బాక్స్‌!

యూఎస్‌ వీసా (US Visa) రెన్యువల్‌ చేయాలను కునేవారు డ్రాప్‌ బాక్స్‌ (Drop Box) ద్వారా దరఖాస్తులు సమర్పించాలని, మెయిల్స్‌ ద్వరా వచ్చిన దరఖాస్తులను స్వీకరించబోమని భారత్‌లోని అమెరికా దౌత్యకార్యాలయం వెల్లడించింది.

Updated : 02 Feb 2023 20:10 IST

ముంబయి: అమెరికా (USA) వీసా రెన్యువల్‌ చేయాలనుకునేవారు డ్రాప్‌బాక్స్‌ (Drop Box) ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని భారత్‌లోని అమెరికా దౌత్యకార్యాలయం (US Embassy) ప్రకటిచింది. మెయిల్స్‌ ద్వారా వీసా రెన్యువల్‌ చేయడాన్ని స్వాగతించబోమని తెలిపింది. ఈ మేరకు అభ్యర్థుల ప్రశ్నకు బదులిచ్చింది. మరోవైపు ఈ ఏడాదిలో భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు మంజూరు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ముంబయిలో యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జాన్‌ బల్లార్డ్‌ వెల్లడించారు. ‘‘యూఎస్‌ వీసాల కోసం ఈ ఏడాది భారత్‌ నుంచి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నాం. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం.’’ అని జాన్‌ బల్లార్డ్‌ తెలిపారు. 2022లో 1,25,000 విద్యార్థి వీసాలను మంజూరు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. 

వీసా మంజూరు, రెన్యువల్‌కు పడుతున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సిబ్బందిని పెంచడంతో పాటు ‘డ్రాప్‌ బాక్స్‌’ విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు. డ్రాప్‌ బాక్స్‌ విధానంలో.. ఇంటర్వ్యూ లేకుండా వీసా రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగేళ్లుగా అమెరికా వీసా ఉన్నవారు ఇందుకు అర్హులు. వెల్లువెత్తుతున్న వీసా దరఖాస్తులను దృష్టిలో ఉంచుకొని భారత్‌లోని యూఎస్‌ ఎంబసీ గత నెలలో ప్రత్యేక చర్యలు మొదలు పెట్టింది. మొదటిసారి వీసా దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహణతోపాటు నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా సిబ్బందిని పెంచుతోంది. ఇందులో భాగంగానే భారత్‌లోని కాన్సులేట్‌ కార్యకలాపాలను వేగవంతం చేసింది. దిల్లీలోని యూఎస్‌ ఎంబసీతోపాటు ముంబయి, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతాలోని కాన్సులేట్‌ కేంద్రాల్లోనూ ప్రతి శనివారం వీసా దరఖాస్తు దారులకు ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని జనవరి 21న లాంఛనంగా ప్రారంభించారు.

వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నామని యూఎస్‌ ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో  పదుల సంఖ్యలో కాన్సులేట్‌ ఆఫీసర్లను తాత్కాలిక ప్రాతిపదికన భారత్‌కు తీసుకు రానున్నట్లు వెల్లడించింది. వీసా జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని