Devi Sri Prasad: ఆ లెక్కలకి అతీతమైనదే సంగీతం

ఉ అంటావా ఉఊ అంటావా... అంటూ దేశం మొత్తం ఊగిపోయేలా చేశాడు

Updated : 27 Feb 2022 08:41 IST

ఉ అంటావా ఉఊ అంటావా... అంటూ దేశం మొత్తం ఊగిపోయేలా చేశాడు.. దేవిశ్రీప్రసాద్‌. ఆయన బాణీల్లో హుషారు అలాంటిది. ఇటీవల ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమా చేశారు. శర్వానంద్‌ కథానాయకుడిగా తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్‌ శనివారం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’... అలా మిమ్మల్ని చెప్పమంటే ఎవరితో మొదలుపెడతారు?
ప్రపంచంలో ఎవరైనా మొదట అమ్మకే జోహార్లు చెబుతారు. మా అమ్మ గురించి అందరికీ తెలిసిందే. మా నాన్న, మేము కెరీర్‌లో విజయవంతం అయ్యామన్నా, మేమంతా సంతోషంగా ఉన్నామన్నా కారణం మా అమ్మే. మా నాన్నకి 32ఏళ్ల వయసులోనే గుండెపోటు వచ్చింది. అప్పట్నుంచి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు.  

ఈ కథ విన్నప్పుడు మీ వ్యక్తిగత జీవితం ఎప్పుడైనా గుర్తుకొచ్చిందా?
ఈ సినిమా జరుగుతున్నప్పుడే దర్శకుడు తిరుమల కిషోర్‌కి కొన్ని ఫొటోలు పంపించా. నా జీవితం మన సినిమాలాగే ఉంటుందని చెప్పేవాణ్ని. మా ఊరు వెళ్లినప్పుడు పిన్ని, బాబాయ్‌లు, అత్తయ్యలు, మావయ్యలు, అక్కవాళ్లూ, వాళ్ల పిల్లలు, కజిన్స్‌... ఇలా అందరూ చుట్టుముట్టేవారు. వాళ్లందరికీ నేనంటే చాలా ఇష్టం, బాగా ముద్దు చేసేవాళ్లు. ఈ సినిమా అలాగే ఉంటుంది. ఇంత మంది కుటుంబ సభ్యుల మధ్య ఓ కుర్రాడి జీవితం ఎలా సాగిందనేది చాలా బాగుంటుంది.

దర్శకుడు తిరుమల కిషోర్‌తో వరుసగా సినిమాలు చేస్తున్నారు. పని విషయంలో ఆయనతో మీకున్న సౌలభ్యం ఎలాంటిది?

కథ విషయంలో తిరుమల కిషోర్‌ చాలా స్పష్టతతో ఉంటాడు. సృజనాత్మకత ఉన్న దర్శకుడు. తను ఎక్కడ పాట కావాలనేది చాలా బాగా చెబుతుంటారు. నేను రాసిన ‘మాంగళ్యం తంతునానేనా...’ నేపథ్యం చెప్పినప్పుడు వెంటనే నాకు ట్యూన్‌ వచ్చేసింది. టైటిల్‌ గీతం అనుకున్నప్పుడు దానికి ఫన్‌ జోడిస్తే బాగుంటుందనుకున్నాం, అదే చేశాం. ఆయన కెరీర్‌లోనే అత్యుత్తమమైన సినిమాగా  ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ నిలుస్తుందని కచ్చితంగా చెబుతా. మిక్సింగ్‌ సమయంలోనే ఈ సినిమాని మూడుసార్లు చూశా. అంత బాగా నచ్చింది. ‘పుష్ప’ ప్రచారం సమయంలోనే సుకుమార్‌కి ఇందులోని ఓ పాట వినిపించా. సూపర్‌ డార్లింగ్‌... అని అప్పుడే చెప్పేశారు. టైటిల్‌ గీతం వచ్చాకైతే అనిల్‌ రావిపూడి, బాబీ, ప్రభుదేవా... ఇలా చాలా మంది మెచ్చుకున్నారు.

‘పుష్ప’ సంగీతం సరిహద్దులు దాటి విశేష ప్రాచుర్యం పొందింది. దానివెనక కారణాల గురించి చెప్పమంటే?
సుకుమార్‌ సినిమాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటాయి. తనకి ఎప్పట్నుంచో ఆ విషయం చెబుతూ నీ సినిమాలు అన్ని భాషల్లోనూ రావాలనేవాణ్ని. అల్లు అర్జున్‌ని పాన్‌ ఇండియాని వదలకు, తమిళంలోనూ చేయమని చెప్పేవాణ్ని. అలాంటి అవకాశం మా అందరికీ ఈ సినిమాతో కుదిరింది. ఐదు భాషల్లో ఈ పాటలు రావడం, ముఖ్యంగా నాకు హిందీ, తమిళం, తెలుగు భాషలు బాగా వస్తాయి కాబట్టి పాటల విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నా. అందుకే ఆయా భాషల్లో ఎక్కడా ఇవి డబ్బింగ్‌ పాటలు అన్నట్టు ఉండవు. ‘పుష్ప’ చేస్తున్నప్పుడే ‘పుష్ప2’ కోసం కొన్ని ప్రణాళికలు వేసుకున్నా. ఆ పనులూ మొదలయ్యాయి.

ఇప్పుడు సంగీతం వేగంగా చేరువవుతోంది. సామాజిక మాధ్యమాలు  ప్రభావం చూపిస్తున్నాయి. సంగీతానికి ఇది మంచి సమయమే కదా?

సంగీతానిది ఎప్పుడూ గోల్డెన్‌ ఎరానే. వందేళ్లు, యాభయ్యేళ్ల కిందట పాటల్ని మనం పాడుకుంటున్నాం కదా. మరి అప్పట్లో ఏ సామాజిక మాధ్యమాలు ఉండేవి? సంగీతం సామాజిక మాధ్యమాల్ని ప్రభావితం చేస్తుందేమో కానీ, దాని వల్ల సంగీతమమేమీ ప్రభావితం కాదు. ఒక పాటకి లక్షలు, మిలియన్ల వ్యూలు వచ్చాయంటే అదేం నాకు గొప్పగా అనిపించదు. ఆ లెక్కలకి అతీతమైనది సంగీతం. ఎప్పుడూ అలా ఎల్లలు దాటి వెళుతూనే ఉంటుంది.

కొత్త సినిమాల కబుర్లు?

‘ఎఫ్‌3’తోపాటు, బాబీ దర్శకత్వం వహిస్తున్న చిరంజీవి సినిమా కోసం మూడు పాటలు చేశాం. పవన్‌కల్యాణ్‌ - హరీష్‌శంకర్‌ కలయికలో ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ చేస్తున్నా. ఓ బాలీవుడ్‌ చిత్రం, వైష్ణవ్‌తేజ్‌తో ‘రంగ రంగ వైభవంగా...’ చేస్తున్నా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని